నవతెలంగాణ-ఆసిఫాబాద్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని గురుకులాల ఆర్సీఓ గంగాధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్ బాల్ అండర్ 13 సబ్ జూనియర్ బాలికల జట్టు ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల క్రీడాభివృద్ధికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. గోవర్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిన్నీటి రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ 100 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారినీలు ఈ నెల 12 నుంచి 14 వరకు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనిత, వార్డెన్ చంద్రకళ, కోచ్లు రవి, వనిత, జ్యోతి, తిరుమల్, అరవింద్, రాకేష్, పిఈటీలు చిన్నక్క, లక్ష్మీ, యాదగిరి, కరుణాకర్ పాల్గొన్నారు.