నేటి నుంచి పాలిసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌

– 9,10 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆది, సోమవారాల్లో ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించొచ్చనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఈనెల తొమ్మిదిన ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. అదేనెల తొమ్మిది, పది తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈనెల 13న తుదివిడత పాలిసెట్‌ ప్రవేశాలకు సీట్లను కేటాయిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.