హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌ విస్తరణ

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌ విస్తరణ– గ్లోబల్‌ ఐటీ సెంటర్‌ ఏర్పాటు : ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌ : మెడికల్‌ టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్‌ కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యకలా పాలను మరింత విస్తరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్‌ ఐటి సెంటర్‌ను బుధవారం ఐటి శాఖ మంత్రి డి శ్రీధర్‌ బాబు, మెడ్‌ట్రానిక్‌ ఎస్‌విపి అండ్‌ సిఇఒ రష్మి కుమార్‌, ఎంఇఐసి సైట్‌ లీడర్‌ దివ్యా జోషి లాంచనంగా ప్రారంభించారు. మెడ్‌ట్రానిక్‌ ఇక్కడ కార్యకలాపాలను విస్తరించడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత అనుకూలమన్నారు. ఇక్కడి నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 60 మిలియన్‌ డాలర్లు (రూ.500 కోట్లు) పెట్టుబడుల వ్యయం చేయనున్నట్లు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ నగరంలో మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కలిగి ఉంది. గ్లోబల్‌ ఐటి సెంటర్‌ అనేది యూఎస్‌ వెలుపల మెడ్‌ట్రానిక్‌కు అతిపెద్ద కేంద్రంగా కావడం విశేషం. వచ్చే ఐదేండ్లలో 300 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించనున్నామని ఆ సంస్థ తెలిపింది.