– చనగాని దయాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏకకాలంలో రుణమాఫీ కోసం రైతులు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరీక్షించారనీ, ఈనాడికి అది నెరవేరబోతున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు రుణమాఫీ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని రైతులు ఎన్నటికీ మర్చిపోలేరని ఆకాంక్షించారు. రైతన్న సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్యం గొప్ప కార్యం చేపట్టడం అసాధారణ విషయమేనని పేర్కొన్నారు. రైతుల కష్టాలకు చలించి అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ అమలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీమేరకు రుణమాఫీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పదేండ్లుగా కేసీఆర్ నాలుగు దశల్లో రూ.28వేలు కోట్లు మాత్రమే చేశారని గుర్తు చేశారు. రుణమాఫీ విషయంలో బీజేపీ కూడా ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసిందనీ, ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. రేషన్ కార్టు ఉంటేనే రైతు రుణమాఫీ అనేది తప్పడు సమాచారమనీ, ఆ కుటుంబాన్ని పరిగణించడం కోసమేనని పేర్కొన్నారు.