ఒమన్: గల్ఫ్ దేశమైన ఒమన్ సముద్ర తీరంలో విషాదం చోటుచేసుకుంది. కొమొరోస్ జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్ బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 16 మంది నౌక సిబ్బంది గల్లంతు అయ్యారు. వీరిలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్గా గుర్తించారు. పోర్టు టౌన్ దుకమ్కు సమీపంలోని రాస్ మద్రాకకు ఆగేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు ఆదేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ పేర్కొంది. ఆయిల్ ట్యాంకర్ ముగినిపోవడానికి కారణాలు వెల్లడించలేదు. ఘటన జరిగిన సమయంలో ఓడలో 16 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఓడ మునిగిపోయి తలకిందులైనట్లు సమాచారం. అయితే సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకైన విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. బుధవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఈ చర్యల్లో పాల్గొనడం కోసం భారత సైన్యానికి చెందిన పి-81 అనే యుద్ధ నౌక కూడా బయలుదేరి వెళ్లింది.