నగల దొంగ..

Krishnasai and Meenakshi Jaiswalతెలుగు తెరపైకి మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రాబో తోంది. కష్ణసాయి – మీనాక్షి జైస్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్‌ థీఫ్‌’. ఈ సినిమా టీజర్‌, ఆడియో లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్‌ మీడియా బ్యానర్‌పై, పీఎస్‌ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్‌ మల్లెల ప్రభాకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ, అజరు, 30 ఇయర్స్‌ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు. ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ సినిమా టీజర్‌, ఆడియో లాంచ్‌ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ డీఐజీ అనిల్‌ మింజ్‌, ఏపీ, తెలంగాణ ఇన్‌కమ్‌టాక్స్‌ కమీషనర్‌ జీవన్‌ లాల్‌ లవిదియ, నటీ ఎస్తర్‌ చిత్ర టీజర్‌తో పాటు పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి ఎస్తార్‌ మాట్లాడుతూ, ‘హీరో కృష్ణసాయి నిజ జీవితంలోనూ రియల్‌ హీరో. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. టీజర్‌ చూస్తే.. ‘జ్యువెల్‌ థీఫ్‌’ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్టు అర్థమవుతోంది. సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకం కలుగుతుంది’ అని అన్నారు. హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ, ‘నేను సూపర్‌ స్టార్‌ కృష్ణ అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్‌ బాగుంది. ఒకప్పుడు హీరోయిన్‌ ప్రేమ సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది’ అని తెలిపారు. డైరెక్టర్‌ పీఎస్‌ నారాయణ మాట్లాడుతూ,’నా మీద నమ్మకంతో తనతో సినిమా చేయమని కృష్ణసాయి వచ్చారు. ఆయనకు తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, సీనియర్‌ నటీనటులు ఉన్నారు. అందరిని ఆకట్టుకునే సినిమా ఇది’ అని చెప్పారు. హీరోయిన్‌ మీనాక్షి జైస్వాల్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాలో నాది ఛాలెంజింగ్‌ రోల్‌. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. నటి ప్రేమ మాట్లాడుతూ,’నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అందరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. కృష్ణసాయి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు’ అని తెలిపారు.