– తెలంగాణ పంచాయతీ రాజ్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి
– గౌరవ వేతనాలు బకాయి నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కకు వినతి
నవతెలంగాణ-చేవెళ్ల
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు రావాల్సిన గౌరవ వేతనాలు, బకాయిల నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్య నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యులతో కలిసి, తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రివర్యులు సీతక్కను మర్యాద పూర్వకంగా కలిసి, గౌరవ వేతనాలు గ్రామాల్లో బకాయిల నిధులు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలుగా ఉన్న స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లకు పదవి కాలం ఫిబ్రవరి జూలై నెలలో పూర్తైనట్టు వివ రించారు. కానీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన సర్పంచ్లు, ఎంపీటీసీలు తమతమ పంచాయతీల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారని వాటి తాలూకా చెల్లింపు జరగలేదన్నారు. దీంతో గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. వెంటనే బకాయి నిధులు చెల్లింపు లకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరినట్టు తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి ఇంకో వారం రోజులలో నిధులు గౌరవ వేతనాలు అందేలా చూస్తానని హామీనిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ సలహాదారులు పూసుకురు అశోక్రావు, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి పండిపల్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.