నవతెలంగాణ – నసురుల్లాబాద్
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని, తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆపద్బాంధవుడు అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఉన్న 187 మంది బాధితులకు సీఎం సహాయనిధి, చికిత్స కొరకు మంజూరైన చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పోచారం అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని,ప్రాణ పాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం చికిత్స కొరకు ఈ రుణాలను అందజేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు గాయపడిన బడుగు, బలహీన, మధ్యతరగతి, పేదల కొరకు కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ , మాజీ ఎంపీపీ పాల్త్య విఠల్ తదితరులు పాల్గొన్నారు.