రూ.2 కోట్ల భారీ విరాళం

రూ.2 కోట్ల భారీ విరాళంసమాజంలో ఏ విపత్తు జరిగినా తక్షణమే స్పందిస్తుంటారు హీరో ప్రభాస్‌. పెద్ద మనసుతో భారీగా విరాళం అందజేస్తుంటారు. కేరళలోని వయనాడ్‌లో జరిగిన ప్రకతి విపత్తు బాధితులకు ఆపన్నహస్తం అందించి, మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు ఆయన. వయనాడ్‌ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్‌ కోరారు. కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రభాస్‌ ఈ విరాళం అందిస్తున్నారు. వయనాడ్‌ బాధితులకు చేయూతనివ్వడం కోసం తెలుగు చిత్ర సీమ తనవంతు సాయం అందిస్తోంది. చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌, రష్మిక మందన్నా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఇప్పటికే తమ గొప్ప మనసుని చాటుకున్నారు.