రిజర్వాయర్లపై అధ్యయనం

– క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు
– చైర్మెన్‌గా మంత్రి ఉత్తమ్‌
– సభ్యులుగా తుమ్మల, జూపల్లి
– సర్కారు ఉత్తర్వులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిల్వ, సామర్థ్యం, పునరుద్ధరణ తదితర అంశాలపై అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. బుధవారం దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ, జలవనరుల సంస్థ(సీడబ్ల్యూసీ), నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ పద్ధతులు, మార్గదర్శకాలను తెప్పించుకోవడం, వాటిని అధ్యయనం చేసి సర్కారుకు సిఫారసులు చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘం పని చేయనుంది. ఈ కమిటీకి చైర్మెన్‌గా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తోడు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా మెంబర్‌ కన్వీనర్‌గా ఉండనున్నారు. ఈ మేరకు జీవో నెంబరు 1056ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేశారు.
9న తొలిభేటీ
మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఈనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లోని సచివాలయంలో జరగనుంది. ఈమేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా కమిటీ సభ్యులకు సమాచారం అందించారు.