ఎస్‌బీఐ నూతన చైర్మెన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి

– డాక్టర్‌ జీ చిన్నారెడ్డి హర్షం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మెన్‌గా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపిక కావడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి చిన్నారెడ్డి బుధవారం హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ పట్టభద్రులైన శ్రీనివాసులు శెట్టి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1988లో ప్రొఫెషనల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అత్యున్నత స్థానమైన చైర్మెన్‌ స్థాయికి ఎదగడం తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. శ్రీనివాసులు హయాంలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు విరివిగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి అనీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడంలో తెలంగాణ రాష్ట్రానికి తోడ్పాటును అందించాలని చిన్నారెడ్డి ఎస్‌బీఐ చైర్మెన్‌ శ్రీనివాసులు శెట్టిని కోరారు.