ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. ‘కెజియఫ్, సలార్’ చిత్రాల తర్వాత నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ను పెట్టారు. ఎప్పుడో అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం అందరి ఆశలను నిజం చేస్తూ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.
హైదరాబాద్లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులకు ఆనందాన్నిచ్చేలా ‘ఎన్టీఆర్ నీల్’ ప్రాజెక్ట్ను జనవరి 9, 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్తో మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మ్యాన్ ఆఫ్ మాసెస్ను నెక్ట్స్ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తారనటంలో సందేహం లేదు. ఈ విషయం ఫ్యాన్స్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఎలమంచిలి, హరికష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైన్: చలపతి.