పోస్ట్‌ చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి

– కేటీఆర్‌ ట్వీట్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్ట్‌ చేసే ముందు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. అంతకు ముందు కేటీఆర్‌, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పుకుంటున్నదంతా అబద్ధమని ట్వీట్‌ చేశారు. సూర్యాపేట ప్రభుత్వాస్పత్రి ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇందుకు బదులుగా మంత్రి దామోదర రాజనర్సింహ రీట్వీట్‌ చేస్తూ, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటనను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వసీంకు బకాయిలో ఉన్న ఒక నెల వేతనం చెల్లించడానికి ప్రాసెస్‌లో ఉందని తెలిపారు.