వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి

Actions should be taken to prevent any damage due to rains– పారిశుధ్య లోపం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగ రాదు
– గురువారం వరకు జ్వర సర్వే పూర్తి చేయాలి
– ఈ వారం చివరికి  మొక్కలు నాటడాన్ని పూర్తిచేయాలి
– జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు  చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.  మంగళవారం  ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీవోలు వారి పరిధిలో  వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, మనుషులు, జంతువులకు ఎలాంటి  ప్రాణ హాని జరగకుండా చూడాలని, అలాగే ఆస్తి నష్టం జరగకుండా చూడాలని,  పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండకుండా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,   కంచె లేని ట్రాన్స్ఫార్మర్లు,పడిపోయిన, వంగిపోయిన, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాల  వల్ల షార్ట్ సర్క్యూట్ వంటివి జరిగి ప్రమాదం సంభవించేందుకు ఆస్కారం  ఉన్నందున వాటిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని  అన్నారు. పడిపోయేందుకు, పెచ్చులూడేందుకు ఆస్కారం ఉన్న పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులను ఉంచవద్దని, ముందే ఖాళీ చేయించి సురక్షిత గదులలో ఉంచాలని ఆదేశించారు.  పొంగిపొర్లుతున్న కల్వర్టులు, వాగులు, వంకల వద్ద తక్షణమే బ్యారికేడింగ్, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే  వర్షం వల్ల దెబ్బ తినేందుకు తెగిపోయేందుకు ఆస్కారం ఉన్న పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారులను, చెరువులు, కుంటలను   గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.  వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా, పైప్ లైన్  లీకేజీలు ఉంటే అరికట్టాలని ఆదేశించారు.పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాటికి జ్వర  సర్వే పూర్తిచేయాలని,మరో వారం రోజుల  పాటు ఈ విషయం  అనుసరించాలని,  వచ్చే శుక్రవారం ఈ అంశంపై ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు  చెప్పారు.వన మహోత్సవం కింద వారంలోపు ఆయా శాఖలకు జిల్లా వ్యాప్తంగా  ఇచ్చిన మొక్కలు నాటే  లక్ష్యాలను  పూర్తి చేయాలని ఆదేశించారు. సంపద వనాలు, పల్లె ప్రకృతి వనాలు, రహదారులకిరువైపుల , అన్ని ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలన్నారు.  హెచ్ఎండిఏ  నుండి లక్ష ఆరువేల పొడవాటి  మొక్కలు తెప్పిస్తున్నందున పెద్ద మొక్కలే నాటాలని,  అన్నిచోట్ల తప్పనిసరిగా మొక్కలు ఉండాలని, నాటిన మొక్కల పై నెలాఖరుకు ఆడిట్ బృందాలతో ఆడిట్ నిర్వహిస్తామని,ఎక్కడైనా మొక్కలు లేనట్లయితే  మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.రుణమాఫీ కి సంబంధించి అన్ని మండలాలలో ఫిర్యాదులు లేకుండా చూడాలని,వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిష్కరించి రైతులకు రుణమాఫీ అయ్యేలా చూడాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం  వేగవంతం  చేయాలన్నారు.  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర,   డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిపిఓ మురళి, నల్గొండ మున్సిపల్ కమిషనర్  సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు మాట్లాడగా,ఈ టెలి కాన్ఫరెన్స్ కు మండలాల ప్రత్యేక అధికారులు,ఆర్డిఓ లు,మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు,ఎంపిఓ లు, ఏపిఓ లు, తదితరులు హాజరయ్యారు.