మధ్య ప్రాచ్యంలో ఏం జరుగుతోంది? ఏ క్షణంలోనైనా ప్రాంతీయ యుద్ధం జరగనుందా ? ఇప్పటికే సూయజ్ కాలువగుండా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలుగుతూ పడుతున్న ఇబ్బందులు మరింతగా పెరుగుతాయా ? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు సామాన్యులకు తలెత్తుతున్న సందేహాలివి. హమాస్ సాయుధులను అణచివేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఇజ్రాయిల్్ అక్టోబరు ఏడు నుంచి ఇంతవరకు ఆ పనిచేయలేక పోయింది. కుట్రలు, దొంగదెబ్బలతో విదేశాల్లో హమాస్ నేతలను హతమారుస్తున్నది. దానికి ప్రతీకారగానే తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఒక సరిహద్దులో ఉన్న లెెబనాన్లో కేంద్రీకరించిన హిజబుల్లా సాయుధులు తమ మీద దాడి చేసే అవకాశాన్ని పసిగట్టి వంద విమానాలతో వారి 40 స్థావరాల మీద తామే ముందుగా ఆదివారం నాడు దాడి చేసినట్లు ఇజ్రాయిల్ చెప్పుకుంది.ఆదివారం నాడు 30 గ్రామాలు, పట్టణాల మీద ఇజ్రాయిల్ వంద విమానాలతో దాడి చేసింది.దానికి ప్రతిగా తాము ఇజ్రాయిల్లోని 11 మిలిటరీ స్థావరాల మీద 340 రాకెట్లను ప్రయోగించామని హిజ బుల్ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి నసరల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము బలమైన మిలటరీ అని, తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీని అర్ధం రానున్న రోజుల్లో దాడులు జరగవని కాదని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు గాజాలో ఇజ్రాయిల్ దాడులను మరింత తీవ్రం కావించింది. అల్ అక్సా ఆసుపత్రిలో ఉన్న రోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి, దానిమీద దాడి చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఐరాస సిబ్బంది పని చేసే అవకాశాలు లేకుడా దాడులు జరుపుతున్నది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్లోని హౌతీ సాయుధులు కూడా దాడులకు దిగటంతో ఇజ్రాయిల్ మరింతగా మారణకాండ సాగిస్తున్నది. హిజబుల్లా దాడిలో జరిగిన నష్టాన్ని ఇజ్రాయిల్ వెల్లడి కాకుండా చూస్తున్నది. ఇరాన్ నేరుగా పోరుకు దిగకుండా తన మద్దతుదార్లకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్నది. తాము పూర్తి స్థాయి దాడులకు దిగటం లేదని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి కట్జ్ ప్రకటించారు. తమ పౌరులను రక్షించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇదే సమయంలో హిజబుల్లా కూడా దాడులను కొనసాగించటం లేదు. రెండు వైపులా లక్షా 60వేల మందిని అటూ ఇటూ వేరే ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ఒక వైపు గాజాలో దాడుల విరమణ గురించి కైరోలో చర్చలు జరుగుతుండగా తమ మీద దాడులు జరపాలని హిజబుల్లా తలపెట్టిందనే సాకుతో ఇజ్రాయిల్ దాడులు జరపటం చర్చలను దెబ్బతీయటం తప్ప మరొకటి కాదు. శాంతి చర్చల కారణంగా చాలా రోజులుగా తాము ప్రతీకారదాడికి దిగలేదని అయితే, ఇజ్రాయిల్ తెగబడినందున తాము స్పందించామని, ప్రతి దాడి ముగిసిందని హిజబుల్లా ప్రకటించగా ఇజ్రాయిల్ సోమవారం నాడు కూడా లెబనాన్ మీద దాడులు చేసింది. తమ గడ్డ మీద హమాస్ నేత హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి యుద్ధం లేకున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి ఉంది. హిజబుల్లా దాడిలో తాము పెద్దగా నష్టపోలేదని, తమ మిలిటరీ స్థావరాలకు ఎలాంటి హాని జరగలేదని ఇజ్రాయిల్ చెప్పుకుంది. గతేడాది అక్టోబరు 8 నుంచి ఇప్పటి వరకు లెబనాన్పై అది జరిపిన దాడుల్లో వంద మంది 566 మంది మరణించగా వారిలో సాధారణ పౌరులు 133 మంది, మిగిలిన వారు సాయుధులు మరణించినట్లు అంచనా. హిజబుల్లా దాడుల్లో 23 మంది యూదు సైనికులు, 26 మంది పౌరులు మరణించినట్లు వార్తలొచ్చాయి. రెండువైపులా లక్షలాది మంది జనం నివాసాలను వీడాల్సి వచ్చింది. ఇజ్రాయిల్ వద్ద అపార ఆయుధ సంపద ఉంది, ఎప్పటికప్పుడు అమెరికా, ఇతర దేశాలు కొత్తగా అందిస్తున్నాయి. అయితే హిజబుల్లా వద్ద అంత పెద్ద మొత్తంలో లేకున్నా ఇజ్రాయిల్లోని అన్ని ప్రాంతాల మీద దాడులు చేసేందుకు అవసరమైన రాకెట్లు ఉన్నట్లు అంచనా. లక్షా 20వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయని, అక్టోబరు ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేలు ప్రయోగించినట్లు సమాచారం. ఆధునిక డ్రోన్లతో పాటు నిర్ణీత లక్ష్యాలను తాకే క్షిపణులు కూడా ఉన్నాయి. ఒక వేళ యుద్ధమే ప్రబలితే రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉంటాయి.2006లో జరిగిన నెల రోజుల పోరులో దక్షిణ లెబనాన్, రాజధాని దక్షిణ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. లెబనాన్ నాశనం కాగా ఇజ్రాయిల్ ఆర్ధికంగా ఎంతో నష్టపోయింది. అప్పటి నుంచి హిజబుల్లాను తుడిచిపె ట్టాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు.
గత పది నెలలుగా ఇజ్రాయిల్, అమెరికా లక్ష్యాలుగా సిరియా, ఇరాక్, ఎమెన్లలో ఉన్న సాయుధ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాటికి ఇరాన్ మద్దతు బహిరంగ రహస్యమే. ఒక వేళ ఇరానే ప్రత్యక్షంగా దాడులకు దిగవచ్చనే అంచనాతో ఇటీవల పెద్ద ఎత్తున తమ నౌకా, వైమానిక దళాలను మధ్య ప్రాచ్యానికి అమెరికా తరలించింది. విమాన వాహక యుద్ధనౌకలు కూడా వాటిలో ఉన్నాయి. ఇజ్రాయిల్ మీద ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే రక్షణ వ్యవస్థలను అమెరికా అందచేసింది.దాన్నే ఇనుప కప్పుగా పిలుస్తున్నారు. లెబనాన్తో ఉన్న సరిహద్దులో పరిస్థితి ఇలాగే ంటుందనే నమ్మకం లేదని ఇజ్రాయిల్ అంటున్నది. ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన తమ పౌరులు డిసెంబరు 31వరకు తిరిగి రావద్దని కోరటాన్ని బట్టి అది ఎంతగా భయపడుతున్నదో అర్ధం అవుతోంది.వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేసింది. గాజాపై తాను జరుపుతున్న దాడులను అప్పటి వరకు విరమించేది లేదన్న సంకేతం కూడా దీనిలో ఉంది. అందువలన రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉంది.
గాజాలో హమాస్ ఉనికి లేకుండా చేయాలని, తిరిగి అది తలెత్తకుండా ఉండాలంటే సాధారణ పరిస్థితి ఏర్పడిన తరువాత కూడా తమ మిలిటరీని అక్కడ అనుమతించాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేస్తున్నది, దీని అర్ధం హమాస్ ఆత్మహత్య చేసుకోవాలని అనటమే అని, దానికి ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న ఆరున్నరలక్షల మంది పిల్లలకు పోలియో వాక్సిన్ వచ్చినప్పటికీ దాన్ని వేసేందుకు ఇజ్రాయిల్ అనుమతించటం లేదు.ఐరాస సిబ్బందిని కూడా వదలకుండా దాడులు చేస్తున్నది. కాల్పుల విరమణ జరగకుండా వాక్సిన్లు వేసే అవకాశాలు లేవు. గాజాలో తొలిసారిగా పాతిక సంవత్సరాల తరువాత తొలి పోలియో కేసు నమోదైంది. మురుగునీటిని పరీక్షించినపుడు వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయింది.పిల్లల్లో 95శాతం మందికి వాక్సిిన్ అవసరమని యూనిసెఫ్ ప్రకటించింది.దాడులు ఆగకపోతే వాక్సిన్ వేయటం కష్టమని స్పష్టం చేసింది.పారిశుధ్య పరిస్థితి దిగజారటంతో పాటు మంచినీటి సరఫరాకూ ఆటంకం కలుగుతోంది. దీంతో ఇతర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఆకలి మంటలు, అనాధలుగా రోడ్ల పాలుకావటం సరేసరి.
ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే దౌత్యఎత్తుగడల పేరుతో అమెరికా ఆడిన నాటకాన్ని యావత్ ప్రపంచ ప్రజానీకం గ్రహిస్తు న్నది. తాను మధ్యవర్తిని అని చెప్పుకుంటూనే 1990 దశకపు ఓస్లో ఒప్పందాల నుంచి నేటి వరకు అనుసరిచిన వైఖరి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ప్రధాన కారణం ఒక వైపు ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తూ భద్రతా మండలిలో దానికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని తీర్మానాలను అడ్డుకోవ టమే. పది నెలలుగా గాజా మారణకాండ సాగుతున్నప్పటికీ దాన్ని ఆపలేకపో యింది. ఇరాన్, లెబనాన్లలో హమాస్ అగ్రనేతల హత్య అమెరికాకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. నవంబరు ఐదున జరిగే ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలని అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. ఏ పరిష్కారం జరిగినా అది తమకు అనుకూలంగా ఉండాలని జోబైడెన్ భావిస్తున్నాడు. ఇజ్రాయిల్ ఓడిపోయినట్లు లేదా వెనక్కు తగ్గిందనే భావనకు వీలులేకుండా చూడాలని చూస్తే కుదరటం లేదు. అదే సమయంలో ఎన్నికల రోజు దగ్గపడేలోగా ఏదో ఒక పరిష్కారం కుదిరితే తమ విజయంగా చెప్పుకోవాలని కూడా బైడెన్ చూస్తున్నాడు. మధ్య ప్రాచ్య యుద్ధం జరగాలని కోరుకుంటున్న అమెరికా వలలో పడేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు.ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉప్పునిప్పు మాదిరి సంబంధాలున్న స్థితిలో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీతో అది సయోధ్య కుదుర్చుకోవటాన్ని అమెరికా ఊహించలేదనే చెప్పాలి. ఒకవైపు తమ మద్దతుతో గాజాలో మారణకాండ సాగుతుండగా మానవత్వం గురించి కబుర్లు చెబుతున్న అమెరికా బండారం మరింతగా బయటపడుతున్నది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కొద్ది రోజుల క్రితం తమ ప్రతిపాదనను ఇజ్రాయిల్ అంగీకరించిందని ప్రకటించారు. అయితే కొద్ది గంటల్లోనే అలాంటిదేమీ లేదని ప్రధాని నెతన్యాహు ప్రకటించి గాలి తీశారు. ఒప్పందానికి ప్రధాని సుముఖంగా లేనందున శాంతి చర్చల్లో తమ ప్రతినిధి పాల్గొనే అవకాశం లేదని కూడా ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. దీంతో ఒప్పందాన్ని నెతన్యాహు అడ్డుకుంటున్నట్లు రెండుదేశాల అధికారులు లీకులు వదిలారు.గడచిన పదినెలల్లో ఏడుసార్లు ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ పర్యటన జరిపారు. శాంతి చర్చలకు ఎప్పటికప్పుడు నెతన్యాహు కొత్త షరతులను జోడిస్తున్నారు. అమెరికా అతగాడికి వంతపాడుతూ వివాదాన్ని కొనసాగిస్తున్న దని కొందరు విమర్శి స్తున్నారు. మధ్యవర్తిగా ఉంటూ ఇలాంటి పని చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ాము పోరాటం కొనసాగిస్తూనే శాంతి చర్చలకు కూడా సిద్ధమని హమాస్ ప్రకటించింది.చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనాలోని అన్ని విముక్తి సంస్థలతో చేతులు కలుపుతామని, పిఎల్ఓ ఆధిపత్యాన్ని అంగీకరించి భాగస్వాములమౌతామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.
ఎం కోటేశ్వరరావు
8331013288