– అన్ని మెట్రో నగరాల్లోనూ స్థాపిస్తాం : కంపెనీ సిఎండి ఆకూరి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెయింట్స్ రంగంలో రాణిస్తోన్న టెక్నో పెయింట్స్ హైదరాబాద్లో తొలి ఎక్స్పీరియెన్స్ సెంటర్ను ప్రారంభించింది. హైటెక్సిటీ హెచ్ఐసిసికి సమీపంలో 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఐజిబిసి నేషనల్ వైస్ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి, క్రెడారు నేషనల్ సెక్రటరీ జి.రాంరెడ్డి, క్రెడారు తెలంగాణ మాజీ ఛైర్మన్ సిహెచ్ రామచంద్రా రెడ్డి తదితరుల సమక్షంలో ఈ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. అనుబంధ కంపెనీ రిచ్వేవ్స్ తయారు చేస్తున్న ఇటాలియన్, లగ్జరీ ఫినిషెస్ను ఇక్కడ ప్రదర్శిస్తారు. రిచ్వేవ్స్ బ్రాండ్లో 200లకుపైగా వెరైటీలను ఆఫర్ చేస్తున్నట్టు టెక్నో పెయింట్స్ సిఎండి ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. సంస్థ ఆర్అండ్డి, తయారీ సామర్థ్యానికి రిచ్వేవ్స్ నిదర్శనం అని అన్నారు. వీటి తయారీకై హైదరాబాద్లోని కూకట్పల్లిలో ప్రత్యేకంగా ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. అన్ని మెట్రో నగరాల్లోనూ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నామన్నారు.