ఆసియా ఖండపు సోక్రటీస్‌:పెరియార్‌

Socrates of Asia: Periyar1977లో మద్రాస్‌ హైకోర్టుకు ఒక పిటిషన్‌ వచ్చింది- తమిళనాడులో పెరియార్‌ విగ్రహాల కింద రాసిన వాక్యాలు ప్రమాదకరంగా ఉన్నాయనీ, అవి ప్రజల దార్శిక భావనల్ని దెబ్బతీస్తున్నాయని-అందువల్ల వాటిని వెంటనే తొలగించాలన్న ఆదేశాలు కోర్టుఇవ్వాలని- ఆ పిటిషన్‌ సారాంశం! అందుకు కోర్టు స్పందించింది. వాదనలు, ప్రతి వాదనలు విన్న తరువాత ఇలా తీర్పిచ్చింది- ఇరోడ్‌ వెంకటప్ప రామసామి పెరియార్‌ ఏ ఆలోచనా ధోరణితో ఉండేవాడో, ఆ ఆలోచనలనే ఆయన విగ్రహం కింద చెక్కించి పెట్టారు. అందులో తప్పేముంది? పెరియార్‌ చెప్పని మాటలు ఆయన విగ్రహం కింద చెక్కించలేదు కదా? ఇష్టమైన వారే చదువుకుంటారు. ఇష్టంలేని వారు మానేస్తారు. అందులో బలవంతం ఏమీ లేదు కదా? ఇంకా అభ్యంతరం ఎందుకూ? అని కోర్టు ప్రశ్నించింది. ‘పెరియార్‌ విగ్రహం కింద చెక్కించి పెట్టిన వాక్యాలు తొలగించనవసరం లేదు’-అని కోర్టుతీర్పు చెప్పింది. విగ్రహాల కింద అమర్చిన ఫలకాల మీద పెరియార్‌ మాటలు ఇలా ఉన్నాయి. ”దేవుడు లేడు – దేవుడు లేనే లేడు!! దేవుడు ఉన్నాడనుకుని దేవుణ్ణి సృష్టించిన వాడు మూర్ఖుడు. ఆ భావాన్ని ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు. ఇక దేవుణ్ణి పూజించే వాడయితే పరమ నికృష్టుడు.”
”ఇంగ్లాండులో బ్రాహ్మణులు లేరు.శూద్రులు గానీ, అస్పృశ్యులు గానీ లేరు. రష్యాలో కులం, మతం అదృష్టాలు లేవు. అమెరికాలో బ్రహ్మముఖం నుండి గానీ, పాదాల నుండి గానీ పుట్టిన వాళ్లు లేరు. జర్మనీలో దేవుడు ఆహారం తీసుకోడు.టర్కీలో దేవుడు పెండ్లి చేసుకోడు. ఫ్రాన్స్‌లో ఆయన పన్నెండు లక్షల విలువైన ఆభరణాలు ధరించడు.ఈ దేశాలలో ప్రజలు తెలివైన వాళ్లు, బుద్ధిమంతులు. వారు, వారి, ఆత్మగౌరవాన్ని వదులుకోవాలని అనుకోరు.వారి దృష్టి కేవలం హక్కుల సాధన మీద, జాతీయ భద్రత మీద, అభివృద్ధి మీద మాత్రమే ఉంటుంది. మరి, మన దేశానికే ఎందుకీ హేయమైన దేవుళ్లు-మత ఉగ్రవాదం?- అని ఆవేదన చెందారు పెరియార్‌ రామసామి. జనంలోని అమాయకత్వాన్ని మూఢ నమ్మకాల్ని, అర్థం లేని సంప్రదాయాల్ని దునుమాడిన వాడు ద్రవిడ ఉద్యమ పితా మహుడైన ఇరోడ్‌ వెంకటప్ప రామసామి (17 సెప్టెంబర్‌ 1879 – 24 డిసెంబర్‌ 1973) అందించిన స్ఫూర్తి దేశానికే పరిమితం కాలేదు. అది ఖండాంతరాలకు పాకింది. THE PROPHET OF NEW AGE అనీ, తూర్పు దక్షిణ అసియా ఖండపు సోక్రటీస్‌-అనీ యునెస్కో గుర్తించి ఆయనకు ఒక ప్రసంసాపత్రం అందించింది.
1977లో మద్రాస్‌ హైకోర్టుకు ఒక పిటిషన్‌ వచ్చింది- తమిళనాడులో పెరియార్‌ విగ్రహాల కింద రాసిన వాక్యాలు ప్రమాదకరంగా ఉన్నాయనీ, అవి ప్రజల దార్శిక భావనల్ని దెబ్బతీస్తున్నాయని-అందువల్ల వాటిని వెంటనే తొలగించాలన్న ఆదేశాలు కోర్టు ఇవ్వాలని- ఆ పిటిషన్‌ సారాంశం! అందుకు కోర్టు స్పందించింది. వాదనలు, ప్రతి వాదనలు విన్న తరువాత ఇలా తీర్పిచ్చింది- ఇరోడ్‌ వెంకటప్ప రామసామి పెరియార్‌ ఏ ఆలోచనా ధోరణితో ఉండేవాడో, ఆ ఆలోచనలనే ఆయన విగ్రహం కింద చెక్కించి పెట్టారు. అందులో తప్పేముంది? పెరియార్‌ చెప్పని మాటలు ఆయన విగ్రహం కింద చెక్కించలేదు కదా? ఇష్టమైన వారే చదువుకుంటారు. ఇష్టంలేని వారు మానేస్తారు. అందులో బలవంతం ఏమీ లేదు కదా? ఇంకా అభ్యంతరం ఎందుకూ? అని కోర్టు ప్రశ్నించింది. ‘పెరియార్‌ విగ్రహం కింద చెక్కించి పెట్టిన వాక్యాలు తొలగించనవసరం లేదు’-అని కోర్టుతీర్పు చెప్పింది. విగ్రహాల కింద అమర్చిన ఫలకాల మీద పెరియార్‌ మాటలు ఇలా ఉన్నాయి. ”దేవుడు లేడు – దేవుడు లేనే లేడు!! దేవుడు ఉన్నాడనుకుని దేవుణ్ణి సృష్టించిన వాడు మూర్ఖుడు. ఆ భావాన్ని ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు. ఇక దేవుణ్ణి పూజించే వాడయితే పరమ నికృష్టుడు.”
దేవుణ్ణి దృష్టిలో ఉంచుకుని పెరియార్‌ రామసామి ఒక పదిహేను ప్రశ్నలు సంధించాడు. అవి ఆ కాలంలోనే సమాజాన్ని అతలాకుతలం చేశాయి. దేవుణ్ణి అమితంగా ఆరాధించేవారు. ఆ ప్రశ్నలు తెలుసుకోకపోవడమే మంచిది. అనవసరంగా వారు, వారి మనోభావాలు దెబ్బతీసుకోకపోతేనే మంచిది. నిజాల్ని నమ్మేవారు, వాస్తవం తెలుసుకుం దామని అనుకునే వారు మాత్రమే పెరియార్‌ ప్రశ్నల గురించి తెలుసుకోవాలి. ఆ ప్రశ్నలు నిత్యనూతనం – దేవుడికి పెరియార్‌ సంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
1. నువ్వేమైనా పిరికివాడివా? ఎవరికీ కనపడకుండా ఎందుకు దాక్కుంటావూ? ఎవరి ముందుకూ ఎందుకు రావూ?
2. రాత్రింబవళ్లు పూలు, అర్చనలు చేయించుకుంటూ ఉంటావు. పొగిడించుకోవడమంటే నీకు అంత ఇష్టమా?
3. యేం? నీకు అంత ఆకలిగా ఉంటుందా? జనాల నుండి ఎప్పుడూ మిఠాయి, పాయసం, పాలు, నెయ్యి స్వీకరిస్తూనే ఉంటావూ?
4. నువ్వేమైనా మాంసాహారివా? నోరు లేని పశువుల్ని ఎప్పుడూ బలికోరుతూ ఉంటావూ?
5. నువ్వేమైనా బంగారంతో వ్యాపారం చేసేవాడివా? నీ గుళ్లలో ఎక్కడికక్కడ లక్షల టన్నుల బంగారం నొక్కేసుకుంటావ్‌?
6. నువ్వేమైనా వ్యభిచారివా? ఆలయాల్లో దేవదాసీలను ఉంచుకుంటావ్‌?
7. ఇంత బలహీనుడివా? నీ ఎదుట రోజూ సమాజంలో జరుగుతున్న రేప్‌లు, శారీరక హింసలు ఆపలేకపోతున్నావ్‌?
8. నువ్వేమైనా మూర్ఖుడివా? ప్రపంచంలో ఇంత పేదరికం ఉంటే, సమయానికి ఇంత ముద్ద దొరకని పేదలుంటే, అన్నీ చూస్త్తూ కూడా అన్నం, పాలు, నెయ్యి, నూనె అన్నీ నదుల్లో పారబోయిస్తున్నావ్‌?
9. నువ్వేమైనా చెవిటివాడివా? అకారణంగా చనిపోతున్న మనుషుల ఆర్తనాదాలు, బలత్కారానికి గురి అవుతున్న పసి కూనల ఏడ్పులు పెడబొబ్బలు వినిపించడం లేదా?
10.నువ్వేమైనా గుడ్డివాడివా? రోజూ ఇన్నిన్ని ఆపరాధాలు జరుగుతూ ఉంటే-నీకేమీ కనిపించడం లేదా?
11.నువ్వేమైనా టెర్రరిస్ట్‌లతో కుమ్ముక్కయ్యావా? ధర్మం పేరుతో ప్రతి రోజూ లక్షల మందిని చంపిస్తున్నావూ?
12.లేక-నువ్వే ఓ మతోన్మాదివా? ఉగ్రవాదివా? నిన్ను చూసి అందరూ భయపడతూ ఉండాలని కోరుకుంటున్నావా?
13.నువ్వేమైనా మాటలు రాని మూగవాడివా? ఏ విషయం గూర్చీ ఒక్కమాట కూడా మాట్లాడవు.కోట్ల మంది లక్షల ప్రశ్నలు గుప్పిస్తున్నా, నీ దగ్గర దేనికీ ఒక్క సమాధానమైనా ఉండదా?
14.నువ్వేమిటీ? అవినీతిలో అంతగా మునిగిపొయ్యావా? పేదసాదలకు ఎప్పుడైనా, ఏమైనా ఇచ్చావా? ఇవ్వకపోగా, వారు పశువుల్లాగా కష్టపడి సంపాదించిందంతా తెచ్చి నీ కోసం ఖర్చు చేస్తున్నారే? నీకేమీ అనిపించడం లేదా?
15.నువ్వెంత మూర్ఖుడివో ఇక్కడే తెలుస్తోంది. అసలు నీ అస్థిత్వాన్నే ఒప్పుకోని మాలాంటి నాస్తికుల్ని పుట్టించావ్‌. మాతో నానా విధాలుగా తిట్లు తింటున్నావ్‌-మాతో రకరకాల విమర్శలు చేయించుకుంటున్నావ్‌?
పెరియార్‌ సంధించిన ఈ ప్రశ్నలకు దేవుడు ఎలాగూ సమాధానమివ్వలేడు. దేవుడి వకాల్తా పుచ్చుకుని శివాలూగే వారైనా చెప్పాలి కదా? చెప్పలేదు-పెరియార్‌ కాలం నుండి ఈనాటి దాకా ఎవరూ ముందుకు రాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయని యాగీ చేయడమో, ప్రత్యర్థుల మీద బూతుల వర్షం కురిపించడమో కాదు కావల్సింది. సంధించిన ప్రశ్నలకు అర్థముందా లేదా? ఉంటే, మనం కూడా ఆ విధంగా ఎందుకు ఆలోచించడం లేదూ అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. బూజు పట్టిన భావజాలాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి.
ఆత్మాభిమానం గల హెతువాదిగా పెరియార్‌, భారతీయ సమాజంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థను తీవ్రం గా నిరసించాడు.అధిక సంఖ్యాకులు శూద్రులుగా అవమానాలకు గురికావడం, మరికొంత మంది అస్పృశ్యులుగా బానిసలకన్నా హీనంగా బతకడం ఆయన సహించలేకపోయాడు. తన పేరులో కులాన్ని తెలిపే ‘నాయకర్‌’ను వదిలేశాడు. ఆత్మగౌరవ ద్రవిడ ఉద్యమానికి రూపకల్పన చేశాడు. ‘వివేకం ఏ మాత్రం లేని జంతువుల్లో విభజనలు లేవు. బ్రాహ్మణ కుక్క, శూద్రకుక్క, పరియ (అస్పృశ్య) కుక్క అని విడివిడిగా లేవే? గాడిదల్లో, కోతుల్లో ఇలాంటి విభజనలు లేవే?’ అని పెరియార్‌ ఆవేదన చెందాడు. హేతువాదమంటే ఏమిటో తెలియని పక్షుల్లో క్రిమికీటకాల్లో విభజన చేసి, అధిక సంఖ్యాకుల్ని ఎందుకు హింసిస్తున్న ట్టూ? బ్రాహ్మణుడికి గౌరవనీయ స్థానమెందుకూ? అతని కాళ్లు కడిగి, ఆ నీళ్లు తాగడమెందుకూ? పెండ్లిళ్లలో, శోభన కార్యక్రమాల్లో, నామకరణం, గృహప్రవేశం- బతుకులో, చావులో బ్రాహ్మణుడికి ఆధిపత్య పాత్ర ఎందుకుందీ? ఎక్కడినుంచో వలసవచ్చి ఇక్కడి మూలవాసుల మీద, ద్రావి డుల మీద అధికారం వెలగబెడు తున్న ఈ ఆర్యబ్రాహ్మణుల కుట్రలు బట్టబయలు చేయకుండా ఇంకా నిశ్శబ్దంగా భరిస్తూ ఉండాలా? అని ప్రశ్నించాడాయన! బ్రాహ్మణులు చెప్పారనే కదా? వారు చేసిన కుట్రలు గ్రహించకుండా, నిర్జీవ ప్రతిమలకు భజనలు చేస్తూ బతుకు బాగుపడుతుంది-అని అనుకుంటున్నారు.అలా ఎన్నటికీ జరగదు పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాల్సిందే!
కొంతకాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న పెరియార్‌. అక్కడ బ్రాహ్మణా ధిక్యతను భరించలేక బయటికొచ్చాడు. గాంధీతో తీవ్రంగా విభేదించాడు. గాంధీ మోసపూరితంగా హిందూధర్మాన్ని పరోక్షంగా ప్రచారం చేశాడనీ అన్నారు పెరియార్‌. అస్పృశ్యులు బావుల్లోని నీళ్లు తాగొద్దంటే, వారికోసం విడిగా బావులు ఏర్పాటు చేయాలన్నాడు. ఆలయ ప్రవేశం కావాలంటే, వారికోసం విడిగా ఆలయాలు నిర్మించాలన్నాడు- గాంధీ. అంతేగాని- మనుషులంతా ఒక్కటి అనే భావనలోకి ఆయన రాలేదు. జనాన్ని రానీయలేదు. అందుకే పెరియార్‌ వేదాల్ని కాల్చేయాలని విగ్రహాల్ని పగల గొట్టాలని ప్రజలకు సూచించాడు. స్వయంగా తనే వినాయకుడి మట్టి విగ్రహాన్ని తెచ్చి, రోడ్డు మీదికి విసిరికొట్టి – ఇలా చేయడం వల్ల కనీసం రోడ్లయినా బాగుపడతాయని సూచించాడు.
1952లో రాజాజీ ‘కుల కల్విథిట్టమ్‌’ అనే పేరుతో ఒక నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. అది కుల వారసత్వాన్ని కొనసాగించే ఒక పథకం! అందులో – ఉదయం పిల్లలు పాఠశాలల్లో చదువుకుంటారు, మధ్యాహ్నం నుండి ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రుల దగ్గర వారి కులవృత్తిని నేర్చుకుంటారు. వడ్రంగి-వడ్రంగి పని, కంసాలి – కంసాలి పని నేర్చుకుంటే, బ్రాహ్మణ పిల్లలు మంత్రోచ్ఛారణ నేర్చుకోవాలి. కాలం గడుస్తున్న కొద్దీ, విద్యావకాశాలు మెరుగవుతున్న కొద్దీ-కులవృద్ధులు తగ్గిపోతున్నందువల్ల, వాటిని పునరుద్ధరించడానికి చేసిన కుట్రగా- పెరియార్‌ లోగుట్టు గ్రహించాడు. కుల విభజనని సమర్థించే ఈ నూతన విద్యావిధానం అనర్థదాయకమని పెరియార్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. రాజాజీయే స్వయంగా 1954లో ఆ విద్యావిధానాన్ని విరమించుకున్నాడు. రాజాజీ తర్వాత ముఖ్య మంత్రిగా వచ్చిన కామరాజ్‌ ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నిషేధించాడు.
పెరియార్‌ జస్టిస్‌ పార్టీ ప్రారంభించకముందు 1926-32 మధ్యకాలంలో మలేసియా, యూరోప్‌, సోవియట్‌ యూనియన్‌ వంటి అనేక దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. తను చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం గురించి, నిరీశ్వరవాదం గురించి ప్రసంగించాడు. 1939లో జస్టిస్‌ పార్టీ స్థాపించి, 1944లో దానిపేరు ద్రవిడ కజగం-గా మార్చాడు. ఇటీవల సనాతన ధర్మం మీద తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో మనం చూశాం. అంటే పెరియార్‌ భావజాలం ఆయన మరణాంతరం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉందన్నమాట! మనువాదుల్ని వణికిస్తూనే ఉందన్నమాట! ఈ అత్వాధునిక కాలానికి కూడా పెరియార్‌ అవసరం ఇంకా చాలానే ఉంది. యునెస్కో ఆయన్ను ‘దక్షిణ ఆసియా సోక్రటీస్‌’ అని ఊరికే అనలేదు. ఒక సత్యాన్ని సత్యంగా నిరూపించడానికి సోక్రటీస్‌ ప్రాణాన్ని త్యాగం చేశాడు.పెరియార్‌ జీవితాంతం అవహేళనకు గురయ్యారు- సత్యశోధనలో! సత్యస్థాపనలో!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు