ఒక్కరి ఆలోచన.. వేలమందికి లబ్ది

One person's idea.. benefits thousands– ‘ఎఫ్‌పీఓ’తో ఆదర్శంగా కందుగుల గ్రామం
– రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటుతో మార్పు దిశగా అన్నదాతల జీవితాలు..
– పంట మొదలు నుండి చివరి వరకు వనరుల కూర్పునకు సహకారం
– త్వరలోనే రైస్‌మిల్‌ ప్రారంభం
– రైతు ప్రోత్సాహక పథకాలతో చేయూతనందిస్తున్న జిల్లా సహకార, వ్యవసాయ బ్యాంకులు
నవతెలంగాణ – భగత్‌నగర్‌
కందుగుల గ్రామానికి చెందిన హుస్సేన్‌ సింగరేణి సంస్థలో పనిచేసి 2018 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం తన స్వగ్రామం హుజురాబాద్‌ మండలంలోని కందుగులకు వచ్చారు. స్వగ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలని సంకల్పించారు. అదే సందర్భంలో రైతులు ఎరువులు, యూరియా కోసం హుజురాబాద్‌ వెళ్లి అధిక ఖర్చుతో కొనుగోలు చేయడం చూసి కదిలిపోయారు. ఎలాగైనా రైతుల కష్టాలను తీర్చాలని, పంట వేసే సమయం నుండి రాబడి వరకు రైతులకు వనరులు సమకూర్చాలని భావించారు. ఈ నేపథ్యంలోనే తమ గ్రామానికి సహకార సంఘాల ఏర్పాటు అనివార్యం అని గ్రహించి, పలువురి సూచనలతో కేంద్ర వ్యవసాయ శాఖ, నాబార్డ్‌ సహాయంతో రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు కోసం నడుం బిగించారు. ఉక్కు సంకల్పంతో ప్రతి రైతుకు ఉత్పత్తిదారుల సంఘం వల్ల కలిగే లాభాలను వివరించి 300 మంది సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో సమ్మిరెడ్డి, రవీందర్‌రెడ్డి, సుమలతరెడ్డి, సదానందంలాంటి సహచరుల బలం తోడై రైతుల సంఖ్య 300 నుండి 1000కి చేరుకుంది. సభ్యత్వం ద్వారా పోగైన మూలధనంతో నాబార్డ్‌ సహకారంతో, జిల్లా సహకార బ్యాంక్‌ నుండి లోన్‌ పొంది గ్రామానికి సొంత రైస్‌మిల్‌, సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌, ధాన్యం నిల్వ కోసం గోధాం ఏర్పాటు కోసం ప్రణాళిక రూపకల్పన చేసారు.
ఇటీవలే రైస్‌మిల్‌ నిర్మాణం పూర్తి కాగా వచ్చే నెలా అక్టోబర్‌ 4న ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రస్తుతం తాము నిర్దేశించుకున్న లక్ష్యాల చేదనలో మొదటి అంకం పూర్తి కాగా, ఈ సంస్థలో భాగస్వాములైన రైతులకు తమ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్‌ దుకాణం ద్వారా రాయితీతో ఎరువులను, ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. త్వరలోనే సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాట్‌తో పాటు,గోదాం నిర్మించి గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రైతుమిత్ర హుస్సేన్‌తో రైతు ఉత్త్పతి దారుల సంఘం ఏర్పాటు కావాల్సిన సమాచారం నవతెలంగాణకు వివరించారు. ఎఫ్‌పీఓ అనేది ‘ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌’ అని పిలువబడే రైతు ఉత్పత్తిదారుల సంస్థ. ఇది రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రారంభించే సంస్థలో ఆసక్తి గల 11 మంది క్రియాశీల రైతులు పైస్థాయిలో ఉండి నడిపిస్తారు. క్షేత్ర స్థాయిలో కనీసం 300 మంది రైతులు సభ్యులుగా ఉంటారు.ఎఫ్‌పీవో ప్రారంభించాలనుకునేవారు ముందుగా అనువైన క్లష్టర్‌ని ఎంచుకోవాలి. వ్యాపార ప్రణాళిక తయారు చేసుకోవాలి. క్లష్టర్‌లో సర్వే నిర్వహించి, మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న పంటలను గుర్తించాలి. మార్కెటింగ్‌ సదుపాయాలను అంచనా వేయాలి. ఫీల్డ్‌ స్టడీ చేసి లాభనష్టాలను అంచనా వేయాలి. ఈ ప్రక్రియ 3 నుండి 6 నెలల సమయం పడుతుంది.
ఎఫ్‌పీఓలో రైతుల పాత్ర
సంస్థలో ప్రతి రైతు ప్రైమరీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తాడు. షేర్‌ హోల్డర్‌గా ఉంటాడు. తన బిజినెస్‌ వాటాను కంపెనీలో జమ చేస్తాడు. కంపెనీ నుంచి వచ్చే స్థిర రాబడులు, బోనస్‌లను పొందుతాడు.
ప్రభుత్వ ప్రయోజనాలు
ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ ఎఫ్‌పీఓ యోజన పథకం’ కింద మొదటి 3 సంవత్సరాలకు రూ.18లక్షల వరకు నిర్వహణ ఖర్చు, ప్రతి రైతు సభ్యునికి 2000 వరకు ఈక్విటీ గ్రాంట్‌ అందిస్తుంది. అంతే కాకుండా క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ మద్దతు, సాధారణ కంపెనీకి లభించే ప్రయోజనాలు ఉంటాయి. నాబార్డు బ్యాంకు నుంచి ప్రత్యేక రుణ సదుపాయాలు ఉంటాయి.
స్థాపించడం ఇలా..
ఎఫ్‌పీఓను కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిన రిజిష్ట్రేషన్‌ చేయాలి. డైరెక్టర్‌ డిజిటల్‌ సిగేచర్‌ సర్టిఫికెట్‌, ఎఫ్‌పీఓ డైరెక్టర్‌ గుర్తింపు నెంబర్‌ తీసుకోవాలి. మెమొరండం ఆఫ్‌ అసోషియేషన్‌తో పాటు ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోషియేషన్‌ తయారు చేసుకోవాలి. ఎఫ్‌పీఓ పేరును రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో రిజర్వేషన్‌ చేసుకోవాలి. ఆర్‌వోసీ కింద ఎఫ్‌పీఓ పేరును రిజిష్ట్రేషన్‌ చేయాలి.
రైతుల అభివృద్ధి కోసమే: మొహమ్మద్‌ హుస్సేన్‌, ఎఫ్‌పీఓ మేనేజింగ్‌ డైరెక్టర్‌
కేంద్ర వ్యవసాయ శాఖ, నాబార్డ్‌ సహాయంతో మేము ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని స్థాపించాం. ప్రారంభంలో 300 మంది సభ్యులతో మొదలుపెట్టి, ఇప్పుడు 1000 మందికిపైగా సభ్యులున్నారు. సమ్మిరెడ్డి, రవీందర్‌రెడ్డి, సుమలతరెడ్డి, సదానందం లాంటి సహచరుల మద్దతుతోనే ఈ వృద్ధి సాధ్యమైంది. ఇది రైతుల అభివృద్ధి కోసమే పనిచేస్తుంది.
తక్కువ ధరలకే ఎరువులు : సుమలత, ఎఫ్‌పీఓ డైరెక్టర్‌
మా ప్రయత్నాల ఫలితంగా మేము ఇప్పుడు సొంత రైస్‌ మిల్లును నిర్మించుకున్నాం. అక్టోబర్‌ 4న ప్రారంభోత్సవం చేయనున్నాం. ఒక ఎరువుల దుకాణాన్ని నడుపుతున్నాము. ఇక్కడ మా సభ్యులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తున్నాము.
రైతుల జీవితాలు మెరుగుపర్చడమే లక్ష్యం
సమ్మిరెడ్డి, ఎఫ్‌పీఓ డైరెక్టర్‌
భవిష్యత్తులో మేము ఒక విత్తన ప్రాసెసింగ్‌ ప్లాంట్‌, ధాన్యం నిల్వ కోసం గోదాం నిర్మించాలని యోచిస్తున్నాము. మా లక్ష్యం రైతుల జీవితాలను మెరుగుపరచడమే. వారికి పంటవేసే సమయం నుండి పంట అమ్మకం వరకు అన్ని దశలలో సహాయం చేయడం.ఈ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, మా రైతుల జీవితాలలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, మా గ్రామంలో ఒక సామూహిక భావన, సహకార స్పూర్తిని కూడా తీసుకువచ్చింది. మా ప్రయత్నాలు ఇతర గ్రామాలకు స్పూర్తినిస్తాయని ఆశిస్తున్నాను.