ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు

– 42 శాతానికి పెంపు సాధ్యమే
– బీసీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీ ముఖ్యనాయకులు జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్యతో సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణన, న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను కూలంకుషంగా చర్చించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల ముమ్మాటికీ సాధ్యమేననీ, ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉన్నదని జస్టిస్‌ ఈ¸శ్వరయ్య సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వాలకు నిజాయితీ ఉంటే సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికలకు మ్యానిఫేస్టోలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సమగ్ర కుల గణన చేసి, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ రాజీలేకుండా పోరాడుతున్నదనీ, ఆ దిశలో ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, వి గంగాధర్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకుడు చెరుకు సుధాకర్‌, మాజీ చైర్మెన్లు పల్లె రవి కుమార్‌ గౌడ్‌, ఆంజనేయ గౌడ్‌, చిరుమల్ల రాకేశ్‌, జి నాగేందర్‌ గౌడ్‌, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, మాజీ శాసన సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్‌, నోముల భగత్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు కిశోర్‌ గౌడ్‌, ఉపేంద్ర చారి, శుభప్రద్‌ పటేల్‌, మాజీ కార్పొరేటర్‌ అలకుంట శ్రీహరి, ఎంపీటీసీల ఫోరమ్‌ అధ్యక్షుడు గడీల కుమార్‌ గౌడ్‌, కార్యదర్శి మన్నె రాజు ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.