నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
అసమానతలు లేని సమాజాన్ని సాధించడమే కేవీపీఎస్ లక్ష్యమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి పవార్ జితేందర్, రెంజర్ల ప్రవీణ్ అన్నారు. బుధవారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆవిర్భావం దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు పవార్ జితేందర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న ఆత్మగౌరవం సమానత్వం కులనిర్మూలన లక్ష్యాల సాధన కోసం అంటరానితనం కులవివక్షతకు వ్యతిరేకంగా కేవీపీఎస్ ఏర్పడిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవివక్ష అంటరానితనంపై వందలాది గ్రామాల్లో వేలాదిమంది కార్యకర్తలచే సర్వేలు అధ్యయనాలు నిర్వహించి సుమారు 128 రకాల కులవివక్ష రూపాలను వెలికి తీసిందన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహించి, జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించిన ఘన చరిత్ర కేవీపీఎస్ సంఘానికి దక్కిందన్నారు. 2004 నుంచి 2013 వరకు సుమారు 10 ఏండ్లు దళిత గిరిజన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని చట్టం చేయాలని కేవీపీఎస్ అనేక సంఘాలు కలుపుకొని పోరాడి 2013లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సాధించిందన్నారు. జిల్లాలో దళితులపైన జరిగిన దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి, బాధితుల పక్షాన నిలబడిందన్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలుకై పోరాడుతున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, పరువు హత్యలను అరికట్టాలని ఉద్యమాలు నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, బ్ల్యూభీం అధ్యక్షులు ప్రేమేందర్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ జిల్లా నాయకులు పూసం సచిన్, ఆత్రం కిష్టన్న, విష్ణు, కె.ఆశన్న, మంజుల పాల్గొన్నారు.