నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించినప్పుడే ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలను పెంచుకోవాలని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ డిఎస్పీ కార్యాలయాన్ని బుధవారం జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి సాయుధ బలగాలతో కూడిన బృందం గౌరవ వందనాలు అందించి, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్, కరుణాకర్ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. కార్యాలయ పరిసరాలను చుట్టూ తిరిగి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న పోలీస్ పోలీస్ స్టేషన్లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారు పిటిషన్ వెంటనే నమోదు చేసి సంబంధిత అధికారులకు అప్పగించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించారని తెలియజేశారు. రాత్రి సమయాలలో అదనంగా గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలను కట్టడి చేసే విధంగా ప్రణాళికను రూపొందించి అవలంబించాలని సూచించారు. సిబ్బంది ఎల్లవేళలా పోలీస్ స్టేషన్లో అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా అందుబాటులో ఉండాలన్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి ఎటువంటి పెండెన్సీ లేకుండా చూడాలని తెలిపారు. ఫైవ్ ఎస్ విధానాన్ని అమలు చేస్తూ రికార్డుల నిర్వహణను చేపట్టాలని సూచించారు. సిబ్బంది విధులను పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలను లేకుండా సరిచూడాలన్నారు. కార్యక్రమంలో సిఐ సునీల్, శ్రీనివాస్, నవీన్ డీఎస్పీ కార్యాలయ సిబ్బంది జైపాల్, రవి, కిష్టయ్య, గణేష్ పాల్గొన్నారు.