రజకులకు రక్షణ చట్టం చేయాలి

– టీఆర్‌వీఎస్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రజకులకు రక్షణ చట్టం చేసి భద్రత కల్పించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (టీఆర్‌వీఎస్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. టీఆర్‌వీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్‌ అధ్యక్షతన ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో రజకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఉచిత విద్యుత్‌ ఎల్‌టీ-2 నుంచి ఎల్‌టీ-4 కేటగిరీకి మార్చాలని పేర్కొన్నారు. బీసీ రుణాలు వ్యక్తిగతంగా రూ.10 లక్షలు, సొసైటీకి రూ.30 లక్షలు ఇవ్వాలని సూచించారు. 50 ఏండ్లు నిండిన రజక వృత్తిదారులకు వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో దోబీ పోస్టులను రజకులతో భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సి మల్లేష్‌, ఎం బాలకృష్ణ, జ్యోతి ఉపేందర్‌, ఎదునూరి మదర్‌, సహాయ కార్యదర్శులు పాయిరాల రాములు కొట్ర నవీన్‌కుమార్‌, చంర్ల కుమారస్వామి, గోపాల్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ పి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.