ఏఈవోలపై సస్పెన్షన్‌ ఎత్తేయాలి

– డైరెక్టర్‌కు టీఎన్‌జీవో, టీజీవో, టీఏఈవోల సంఘాల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అకారణంగా సస్పెండ్‌ చేసిన వ్యవసాయ విస్తరణ అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనీ, ఆ ఉత్తర్వులను ఎత్తేయాలని రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, టీజీవో అధ్యక్షులు ఎలూరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర టీఏఈవోల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి సురేష్‌ రెడ్డి బుధవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.డిజిటల్‌ క్రాఫ్‌ సర్వే (డీసీఎస్‌)లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఏఈవోలను మానసిక ఒత్తిడికిలోనూ కాకుండా ఉండేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరారు. దీనికి డైరెక్టర్‌ సానుకూలంగా స్పందించి సస్పెన్షన్‌ ఎత్తివేస్తామంటూ హామీ ఇచ్చారు. డీసీఎస్‌ విషయంలో అందరూ వెంటనే డౌన్లోడ్‌ చేసి పని మొదలు పెట్టాలని సూచించారు. ఈ విషయంలో ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.