26 మంది తెలంగాణ పోలీసులకు

– ‘కేంద్ర గృహ మంత్రి దక్షతా పదక్‌’ అవార్డులు
– ఏపీలో ఐదుగురికి : కేంద్ర హౌం శాఖ వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి సందర్భంగా ప్రతి యేటా కేంద్ర హౌంశాఖ ప్రకటించే జాతీయ అవార్డుల్లో తెలంగాణ నుంచి 26 మంది పోలీసులకు అవార్డులు దక్కాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐదుగురికి ఈ మెడల్స్‌ వరించాయి. 2024 ఏడాదికి గానూ దేశ వ్యాప్తంగా 463 మంది పోలీస్‌ సిబ్బందికి ‘కేంద్ర గృహ మంత్రి దక్షతా పదక్‌’ అవార్డులను ప్రకటిస్తూ కేంద్ర హౌంశాఖ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. తేదీల వారీగా… స్పెషల్‌ ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇతర విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
తెలంగాణ నుంచి గతేడాది మే 9న చేపట్టిన ఆపరేషన్స్‌కు గానూ సీఐ చేగురి సుదర్మన్‌ రెడ్డి, ఏఆర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ ముజీబ్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు డి మోహన్‌ రెడ్డి, పండరి రవిందర్‌, కానిస్టేబుళ్లు డి రాంచంద్రా రెడ్డి, ఎం నాగరాజు, పి రాజేందర్‌, కె శ్రీకాంత్‌ గౌడ్‌ను కేంద్ర హోం శాఖ అవార్డులకు ఎంపిక చేసింది.
వీరితో పాటు ఈ ఏడాది ఏప్రిల్‌ 6న చేపట్టిన ఆపరేషన్స్‌కు గానూ గ్రూప్‌ కమాండర్‌ జె రాఘవేంద్రా రెడ్డి, సీనియర్‌ కమాండోలు తిప్పని రాకేశ్‌, యూ మల్లయ్య, జూనియర్‌ కమాండో గంట సాయి కుమార్‌లకు అవార్డులు దక్కాయి. అలాగే ఏప్రిల్‌ 11, 12 తేదీల్లో చేపట్టిన ఆపరేషన్స్‌కు గానూ ఎస్పీ భాస్కరన్‌, సీఐలు బీసం హరి ప్రసాద్‌, కంపల్ల శ్రీనివాస్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు చారీ రాంబాబు, డొంకల రాంబాబు, గౌతమ్‌ రెడ్డి, పి. సంతోష్‌ కుమార్‌, డి. రాజేశ్‌, కానిస్టేబుళ్లు కడరి హరిబాబు, ఎజిడి మార్కస్‌, ఎస్పీ సత్యనారాయణడెపుడు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీధర్‌ రెడ్డిమామిళ్ల, అడిషనల్‌ ఎస్పీ సంగరామసింగ్‌ గణపతిరావు పాటిల్‌, ఏసీపీి శ్రీధర్‌ రెడ్డి పులిమామిడికి ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది.