మానవాళి సంక్షేమానికి సైన్స్‌ ఉపయోగపడాలి

– వరంగల్‌ నిట్‌ అధ్యాపకులు ప్రొఫెసర్‌ రామచంద్రయ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మానవాళి సంక్షేమానికి సైన్స్‌ ఉపయోగపడాలని వరంగల్‌ నిట్‌ రసాయన శాస్త్ర అధ్యాపకులు ప్రొఫెసర్‌ ఏ రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మంచీ చెడూ రెండు ఉన్నాయని చెప్పారు. పాముల విషం కూడా ప్రొటీన్‌లేనని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”2024 నోబెల్‌ బహుమతి పొందిన రసాయన శాస్త్రజ్ఞులు ప్రోటీన్‌కు సంబంధించి ఏమి కనుగొన్నారు’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. దీనికి ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రోటీన్‌ స్ట్రక్చర్‌ కరోనా స్ట్రక్చర్‌కు దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని చెప్పారు. ప్లాస్టిక్‌ను కాలుష్యం కాకుండా చేసే అవకాశమూ ఉందన్నారు. ప్రజాసంక్షేమానికి సైన్స్‌ను వాడుకోవాలని తెలిపారు. సైన్స్‌ మంచితోపాటూ చేడూ చేస్తుందని శాస్త్రవేత్తల అభిప్రాయమని వివరించారు. వందల ఏండ్లుగా ప్రోటీన్లను తయారుచేస్తున్నారని గుర్తు చేశారు. ప్రకృతి ద్వారానే జీవం ఆవిష్కృతం జరిగిందన్నారు. అనేక అంశాల్లో పరిశోధనలు చేసే వారందరికీ నోబెల్‌ బహుమతులు ఇచ్చారనీ, కమ్యూనిస్టు శాస్త్రవేత్త జేడీ ధర్నార్‌కు ఇవ్వలేదని వాఖ్యానించారు. డీఎన్‌ఏలోని జీన్సే ప్రోటీన్లు అని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు చెబుతున్నారని వివరించారు. శరీరంలోని కార్యకలాపాలకు ప్రోటీన్లు చాలా ముఖ్యమని చెప్పారు. పప్పు ధాన్యాలు, గుడ్లు, పాలు, విత్తనాలు, శెనగలు, కందిపప్పు ఇలా అనేక పదారాల్లో ప్రోటీన్లు ఉంటాయని గుర్తు చేశారు. వీటిపై పెద్దపెద్ద సంస్థలు పరిశోధనలు చేశాయన్నారు. ప్రోటీన్ల కదలికలపై అధ్యయనాలు జరుగుతు న్నాయని చెప్పారు. ప్రయోగశాలల్లోనూ వీటిని తయారు చేయడానికి అవకాశముందన్నారు. కొత్తగా ప్రోటీన్లను సృష్టించారని చెప్పారు.