– అవసరమైతే వ్యాపారులపై ఎస్మా ప్రయోగించండి : సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అలాంటి వ్యాపారులపై ఎస్మా ప్రయోగించాలని సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల రైతులను మార్కెట్లలో వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు దృష్టికి రావడంపై సోమవారం సీఎం స్పందించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు.
రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలనీ, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.