మ‌హిళ‌ల‌పై హింస ప్ర‌భావం

Impact of violence on womenప్రకృతిలో ఏ జీవీ కారణం లేకుండా మరొక జీవిపై దాడి చేయదు. క్రూర మృగాలు కూడా ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే వెంటాడతాయి. ఆకలి లేనప్పుడు పక్కనుండి పోతున్న చిన్న చిన్న జంతువులను కూడా ఏమీ చేయవు. కానీ మెదడు బాగా అభివృద్ది చెంది, జ్ఞానం పొందిన మనిషి మాత్రం తన స్వార్థం కోసం, తాత్కాలిక సంతోషం కోసం ఎంతటి హింసకైనా సిద్ధంగా ఉంటాడు. ఎదుటి వారి ప్రాణాలు అంతే అవలీలగా తీయగలడు. మరీ ముఖ్యంగా మహిళంటే మగాడికి మరింత అలుసు. నేనేం చేసినా చెల్లుతుంది అనే ఆధిపత్య ధోరణి. దీనికి తోడు రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు కూడా కలిసి నేడు మహిళలపై హింస మరింత ఎక్కువవుతోంది.
ఒక్కోసారి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం, అత్యాచారం, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల వంటివి జరిగినప్పుడు షాక్‌కి గురై మనసు కొంతసేపు మొద్దుబారిపోతుంది. కొంత మంది వెంటనే జరుగుతున్నది తెలుసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు మహిళపై పురుషుడు చేసే దాడుల నుండి తప్పించుకునే అవకాశం ఉండదు. ఒక్కోసారి ఆ షాక్‌ నుండి బయటకు రావడానికి కొన్ని వారాలు, నెలలు కూడా పట్టొచ్చు. గాయాల వలన అసలు మామూలు స్థితికి రాలేక పోవడం, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.
ఆమె ఒక్కతే కాదు…
ప్రపంచం అభివృద్ది వైపు దూసుకుపోతున్న నేటి హైటెక్‌ యుగంలోనూ మహిళ తన జీవితంలో ప్రతి దశలోనూ ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కుంటూనే ఉంది. ఐక్య రాజ్య సమితికి చెందిన రెండు సంస్థలు రోజుకు సగటున 140 మంది బాలికలు, మహిళలు బంధువులు లేదా భర్త చేతుల్లో మరణిస్తున్నారని, 2023లో 51300 మంది మరణానికి వారి కుటుంబ సభ్యులే కారణమని చెప్పాయి. అంటే కాలంతో పాటే మహిళపై హింసకూడా పెరుగుతుంది. దీనికి కుటుంబంతో పాటు సమాజం, రాజ్యం కూడా కారణమే. మహిళలు ఎదుర్కొనే హింస లో లైంగికదాడి మరింత ప్రమాదకరమైనది. ఎక్కువగా భర్త లేదా సన్నిహిత భాగస్వామి, తెలిసిన వారే ప్రధాన నిందితులుగా ఉంటున్నారు. వీటివలన బాధితురాలు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలం ఆరోగ్య సమస్యలను భరించాలి. పని శ్రద్ధగా చేయలేని అశక్తత వల్ల ఉపాధి పోయి ఒక్కోసారి కుటుంబం రోడ్డున పడుతుంది. దాడికి గురైన ఆమె ఒక్కతే కాదు పిల్లలు, కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న సమాజం కూడా భరించాలి.
మన అనుకున్న వారితోనే
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జనాభాలోని ప్రతి ముగ్గురు 15-49 ఏండ్ల వయసు మహిళల్లో ఒకరు అంటే 30% ఏదో ఒక రకంగా లైంగిక హింసకు గురవుతున్నారు. వీటిలో దాదాపు 40% బాగా తెలిసిన వాళ్ళ వల్ల, 6% మంది మాత్రమే బయటవాళ్ళ మూలంగా జరుగుతున్నాయి. నిజం మాట్లాడితే ప్రతి మహిళా తన జీవితంలో ఒక్కసారైనా ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురయ్యే ఉంటుంది. మన అనుకున్న వారితోనే ప్రమాదం అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో బయిటకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఈ హింస దాదాపు రెట్టింపు అయిందని నివేదికలు చెబుతున్నాయి. జష్ట్రఱశ్రీస Abబరవ Aష్‌ కింద లైంగికత గురించి ఏ మాత్రం అవగాహన, గ్రహింపు లేని వయసు వారితో వారి సమ్మతి లేకుండా లైంగిక కోర్కెలు తీర్చుకోవడం నేరం. 18 ఏండ్ల లోపు పిల్లల శరీర భాగాలను తాకినా, లైంగిక చర్యను సూచించే మాటలు, సైగలు, అశ్లీల చిత్రాలు చూపించడం పోక్సో చట్టం కింద నేరం. ఈ చట్టాలేవీ నెలల పసికందులపై జరిగే అత్యాచారాలను ఆపలేకపోతున్నాయి. ఓ సర్వే ప్రకారం దాదాపు 50% కన్నా ఎక్కువ మంది పిల్లలు మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. చాలామంది తల్లి తండ్రులు రిపోర్ట్‌ చేయడానికి బయటకు రావడం లేరు. సున్నితమైన విషయం కాబట్టి పరువు, మర్యాద పోతుందని వారి భయం.
మనుస్మృతి బోధనలవల్లే…
నిర్భయ, హత్రాస్‌, కథువా, ఆర్జికార్‌ సంఘటనల గురించి విన్నప్పుడు మనుషులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అనే అనుమానం వస్తుంది. శత్రువు మీద కూడా అంత పైశాచికంగా దాడి చేయరు. దాదాపు అన్ని అవయవాలను ప్రమాదకరంగా గాయపరిచి, ఎముకలు విరిచేశారు. అటువంటి దాడిలో బాధితులు బతికే అవకాశం తక్కువే. ఓ అమ్మాయి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే అధికారం వాళ్ళకు ఎవరిచ్చారు? మనదేశంలో అప్రకటిత రాజ్యాంగంగా చెలామణి అవుతున్న మనుస్మృతి బోధించిన పురుషాధిక్య భావజాలం నేర్పుతున్నదే ఇదంతా. ఈ లైంగిక దాడులకు అసాంఘిక వ్యక్తిత్వం, మద్యం, డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్లు, నిందితులకు అండగా నిలబడే రాజకీయ నాయకులు, కామాంధులను కాపాడే నేటి న్యాయ వ్యవస్థ అన్నీ కారణాలే. అఘాయిత్యాలు ఎన్నిచేసినా తప్పులేదు అనే భరోసా ఉండబట్టే కదా ఇంత ధైర్యం. స్త్రీని లైంగిక వస్తువుగా చూసినంత కాలం హింస తగ్గదు.
అనారోగ్య సమస్యలు
లైంగిక హింసకు గురైన మహిళలు బ్లీడింగ్‌, కడుపునొప్పి వంటి తీవ్ర సమస్యలే కాకుండా దీర్ఘకాలిక శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన సమస్యలనూ ఎదుర్కొంటారు. గర్భధారణ, అబార్షన్‌, కడుపులోని శిశువు ఎదగడంలో లోపాలు, బరువు తక్కువగా పుట్టడం, ముందే డెలివరీ కావడం, బిడ్డ చనిపోయి పుట్టడం వంటివి జరుగుతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు, ఒత్తిడి, మైగ్రేన్‌ తలనొప్పి, నిద్రలేమి, ఆకలి లేకపోవడం డిప్రెషన్‌, హత్య లేదా ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తారు. హెచ్‌ఐవీ వంటి లైంగిక వ్యాధులు సోకే ప్రమాదమూ ఉంది. ఇక పసిపిల్లలైతే తమపై దాడి జరిగిందని కూడా తెలుసుకోలేరు. కనీసం డాక్టర్లు కూడా గుర్తు పట్టలేకపోవచ్చు. నొప్పితో ఏడ్వడం, సరిగా తినకపోవడం వల్ల పోషకాహార లోపం, పెరుగుదల లేకపోవడం, చదువులో వెనక పడడం వంటివి ఎదురవుతాయి. అసహజ ప్రవర్తన, కారణం లేని కోపం, ఒత్తిడి, ఇంట్లో, బడిలో కూడా స్నేహితులతో కలవలేక పోవడం, అందరితో గొడవలు పెట్టుకోవడం చేస్తుంటారు. నిద్రలో భయపడడం, ఏడ్వడం వంటివి చూసినప్పుడు తల్లి తండ్రులు ఓపికగా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పెద్ద పిల్లలు అయితే అసాధారణ లైంగిక ప్రవర్తన, చెడు అలవాట్లవైపు వెళ్ళడం, హింసకు దారి తీసే పనులు చేస్తారు. ఇలా ఎవరో చేసిన తప్పును పసి బిడ్డలు, కుటుంబ సభ్యులు, సమాజం కూడా భరించ వలసి ఉంటుంది.
మన దగ్గరే ఎక్కువ
అభివృద్ది చెందిన దేశాలతో కన్నా మహిళను దేవతగా పూజించే మనదేశంలోనే హింస, మరణాల శాతం చాలా ఎక్కువ. మహిళలు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మగవారికి ఎదురు చెప్పకూడదనే భావజాలాన్ని పాటించక తప్పడం లేదు. మహిళాభివృద్ధి, సమానత్వం, సాధికారత అని నాయకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనాన్ని అర్థం చేసుకోవాలి. కుటుంబంలో మహిళకు ప్రత్యేక గౌరవం అవసరం లేదు, సాటి మనిషిగా చూసుకుంటే చాలు. చివరగా.. ఎవరు లైంగిక వేధింపులకు గురైనా సమస్యను అర్థం చేసుకోవడం, వారిపట్ల సానుభూతి చూపడం, కనీస మద్దతు తెలియచేయడం నాగరికులుగా మన కనీస బాధ్యత.
– డా|| సిహెచ్‌.శారద