నూతన మండలంగా మల్లంపల్లి

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ములుగు జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలతో కొత్తగా మల్లంపల్లి మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్వి నవీన్‌ మిట్టల్‌ జీవో నెంబర్‌ 125 జారీ చేశారు. మల్లంపల్లితో పాటు రామచంద్రపూర్‌ గ్రామాలు ఈ మండలం పరిధిలోకి రానున్నాయి. కొత్తగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలకు ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పదేండ్లుగా ఈ ప్రాంత ప్రజలు మండలం కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మండలం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.