– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
– ఐటీఐ మహిళా కళాశాల ప్రారంభం
నవతెలంగాణ- ఘట్కేసర్
విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో హిందుస్థాన్ ఏరోనాటికల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐటీఐ మహిళా కళాశాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రష్ యాదవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఐటీఐ కళాశాలను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అధునాతన పరిజ్ఞానంతో కూడిన ఐటీఐ కళాశాలలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్లో ఉపాధి పొందే దిశగా అధునాతనమైన శిక్షణకు సంబంధించిన పరికరాలతో కూడిన తరగతి గదులను నిర్మిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళలకు అవసరమైన విభాగాలను గుర్తించి అందుకు అనుగుణంగా విషయపరిజ్ఞానం పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు మిషనరీతోపాటు కొత్త కొత్త హంగులతో ఏ విధంగా తయారు చేయాలో శిక్షణ ఇస్తారని చెప్పారు. అనంతరం మంత్రి కళాశాల ప్రాంగణంలో మొక్క నాటారు. తరువాత ఘట్కేసర్లోని గురుకుల్ జూనియర్ కాలేజీలో రూ.కోటి 50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడే సీఎం కప్ ఆటలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మురళి పావని జంగయ్య యాదవ్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ సంజరు కుమార్, జిల్లా కలెక్టర్ గౌతం, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో సైదులు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.