– తొమ్మిదేండ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయింది
– కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే దీనికి నిదర్శనం : ఫ్లోరిడాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్షతన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో నిర్వహించిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో వేదపండితులు మంత్రిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు అనిల్ బందారం, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానుగంటి, టోని జాను, మోహిత్ కర్పూరం పాల్గొన్నారు.