జపాన్‌లో భూకంపం..

టోక్యో: జపాన్‌లో భూకంపం సంభవించింది. స్థానిక మీడియా సమాచారం మేరకు దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్టు ఆ దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే మియాజాకితోపాటు కొచీ ప్రాంతాలకు సునామీహెచ్చరికలు జారీ చేసింది. అయితే నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. గతేడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యుషు, షికోకులను కుదిపేశాయి. అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.