జర్నలిస్టులకు, ముఖ్యంగా ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేవారికి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నిమగమైన వారికి రక్షణ కరువైంది. జర్న లిస్టులు, మీడియా సంస్థలపైనా దాడులు పెరుగుతున్నాయి. భావప్రకటనా స్వేచ్చా హక్కును వినియోగించుకోవడానికి ఏమాత్రం సాహసోపేతమైన అడుగు ముందుకు పడినా బెదిరింపులు, కేసులు, జైలు శిక్షలు, రాజద్రోహాలు స్వాగతం పలుకు తున్నాయి. రాజ్యమో, రాజ్యం అండతో రాజ్యమేలే గుంపులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ఒక రకంగా జర్నలిస్టులను నిశ్శబ్దం చేసే ప్రక్రియ చాలా పకడ్బందీ ప్రణాళికతో సాగుతున్నది. భయపెట్టే వ్యూహాలలో అంతిమ వ్యూహంగా జర్నలిస్టులను చంపేసేందుకు వెనుకాడటం లేదు. ఇందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఫ్రిలాన్స్ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్య ఉదంతం యావత్తూ జర్నలిస్టులను ఉలిక్కిపడేలా చేసింది.
33ఏండ్ల వయస్సు కలిగిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ జనవరి 1న అదృశ్యమై బీజాపూర్ పట్టణంలోని సెప్టిక్ ట్యాంక్లో అతని మృతదేహం జనవరి 3న కనుగొనబడింది. ఇంతకీ ఆ జర్నలిస్టు చేసిన నేరమేమిటి..? ఛత్తీస్గఢ్లోని రోడ్డు నిర్మాణంలో అవకతవకలను ఎత్తిచూపారు. రూ. 120 కోట్ల విలువైన కాంట్రాక్ట్లో అవినీతిని బయటపెట్టారని, జర్నలిస్ట్ ముఖేష్ను దారుణంగా హత్య చేశారు. అతడిని హంతకులు దారుణంగా హింసించి చంపేసినట్లు రిఫొర్ట్లు పేర్కొంటున్నాయి. గుండెను చీల్చి బయటకు తీశారని, కాలేయాన్ని నాలుగు ముక్కులు చేశారని, అతడి పక్కటెముకులు ఐదుచోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయని, ఈ విషయాలన్నీ పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం కావడం, సీనియారిటీ కలిగిన వైద్యులే తమ వైద్య వృత్తిలో ఈ తరహా హత్యను ఇప్పటివరకు చూడలేదంటూ ఈ పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు సైతం స్పష్టం చేశారంటే ఈ హత్యను ఎంత పాశవికంగా చేశారో అర్థమవుతోంది.
సత్యాన్ని కనుగొనాలని పట్టుదలతో, ఆ సత్యాన్ని అధికారంతో మాట్లా డటం జర్నలిజం సారాంశంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ”జర్నలిస్ట్ గా, రాయడం, మాట్లాడటం ఈ సమాజంలో ఉన్న విభిన్న పరిస్థితులను, సంఘటనలను విశ్లేషించడం అర్థం చేసుకోవడం, సమాజానికి సమాచారం అందించడం జర్నలిస్టు పనిగా ఉంటుంది. ఈ తరహా పనినే ముఖేష్ చంద్రకర్ నిర్వర్తించారు. ఆయన ఎన్డిటివి న్యూస్ ఛానెల్కు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేశారు. దాదాపు 1.59 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ”బస్తర్ జంక్షన్” అనే యూట్యూబ్ ఛానెల్ను నిర్వహించారు. ఒకానొక సందర్భంలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించిన బీజాపూర్లోని తకల్గూడ నక్సలైట్ల ఆకస్మిక దాడి తరువాత ఏప్రిల్ 2021లో మావోయిస్టు చెర నుండి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ను విడుదల చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడనేది రికార్డులు పేర్కొన్నాయి. అలాంటి ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య ఏం చెప్తోంది..? ఒకరకంగా జర్నలిస్టులను నిశ్శబ్దం చేసే అంతిమ వ్యూహం చంపడమే అనే హెచ్చరిక జారీ చేస్తుందనేది ఇక్కడ గమనించాల్సిన సత్యం.
ప్రజాస్వామ్యానికి ఉత్తమ రక్షణగా ఉండే జర్నలిస్టులు ఒకరకంగా చీకటి నీడల మధ్య అప్రకటిత ఎమర్జెన్సీలో మునుపెన్నడూ లేని విధంగా తమ వృత్తిని కొనసాగించాల్సిన వస్తోంది. సత్యానంతర యుగంలో, సత్యం వైపు నిలబడాలని, నిలకడగా నిక్కచ్చిగా ఉండే జర్నలిస్టులు మార్కెట్ శక్తులకు లొంగిపోవడాన్ని లేదా మీడియా మార్కెట్ నుండి తరిమి వేయబడడాన్ని ఎంచుకోవలసి వస్తోంది. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈనేపథ్యంలో ‘విద్వేష పాలన’లో నిజం చెప్పడం సాహసోపేతమైన చర్య. కానీ, జర్నలిస్టులు సత్యం వైపే నిలుస్తారని, నేర సామ్రాజ్యం ఉలిక్కిపడేలా మరింత పదునుగా అక్షర సమరం చేస్తారని చాటిచెప్పాలి. ముఖేష్ చంద్రకర్ హత్య చేసిన దోషులను చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్ను విస్తృతపరచాలి. జర్నలిస్టులకు, ముఖ్యంగా ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేవారికి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నిమగమైన వారికి రక్షణ చట్టం కల్పించాలి.దీనికి ప్రజలంతా ఏకోన్ముఖంగా పాలకులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– రాజేందర్ దామెర