‘మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హిట్ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించింది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్. ఈ ప్రొడక్షన్ నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్గా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పకులు. నూతన దర్శకుడు ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ను లాంచ్ చేశారు. గురువారం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘సరదాగా, నవ్వుతూ షూటింగ్ చేశాం. మితేష్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. శాండిల్య మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. సెట్లో యాక్టింగ్ చేసేటప్పుడే నాకు నవ్వొచ్చేది. ఈ చిత్రంలో అందరూ గొప్పగా నటించారు. నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు. దివిజ ఎంతో సహజంగా నటించింది’ అని అన్నారు.
‘బ్రహ్మానందం అంటేనే కింగ్ ఆఫ్ కామెడీ. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్టు.. ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ టైటిల్ చాలు’ అని వెన్నెల కిషోర్ చెప్పారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ, ‘బ్రహ్మా ఆనందం అనే సినిమాను బ్రహ్మానందంతో చేయడం మామూలు విషయం కాదు. రాజా గౌతమ్ చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తారు. ఈ సినిమాతో నా సక్సెస్ మళ్లీ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘మా నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని రాజా గౌతమ్ చెప్పారు. డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ మాట్లాడుతూ, ”బ్రహ్మా ఆనందం’ కథను పట్టుకుని తిరుగుతున్న టైంలో రాహుల్ దొరకడం నా అదష్టం. నా డైరెక్షన్ టీం ఎంతో సపోర్ట్గా నిలిచింది. హీరో రాజా గౌతమ్ అద్భుతంగా నటించారు. ఆయన కోసమే ఈ సినిమాను నాలుగైదు సార్లు చూస్తారు’ అని అన్నారు. ప్రియా వడ్లమాని మాట్లాడుతూ,’ఇంత మంచి చిత్రంలో నేను నటించినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది’ అని తెలిపారు.