– దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించండి : అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ టూరిజం కొత్త పాలసీని ఫిబ్రవరి 10లోగా తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక శాఖపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల్లోని ఉత్తమ పాలసీలను అధ్యయనం చేసి పర్యాటకులను ఆకర్షించేలా విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం విభాగాలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధ చేయాలని సూచించారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని అన్నారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయనీ, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక ప్రాంతాల గుర్తింపు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య, ఎన్టీఆర్, ఇందిరా పార్క్లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.