అరుదైన విశ్వ విజయ శతక వేడుక

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బలగం’. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వంద అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
ఈ సందర్భంగా విశ్వ విజయ శతకం ఈవెంట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘నేను ఎన్నో వంద రోజుల ఫంక్షన్‌లు చూశాను.. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటి సారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నాం. ఈ కథను మా దగ్గరకు తీసుకొచ్చిన వేణుకి, వేణుని మా దగ్గరికి తీసుకొచ్చిన ఈస్ట్‌ డిస్ట్రిబ్యూటర్‌ శివరాంకు థ్యాంక్స్‌. మళ్లీ ఇలాంటి అద్భుతాలు జరుగుతాయో లేదో తెలిదు. అందుకే ఈ రోజు ఇలా ఈవెంట్‌ చేసుకుంటున్నాం’ అని తెలిపారు. హన్షిత మాట్లాడుతూ, ‘నేను, అన్న కలిసి స్టార్ట్‌ చేసిన ప్రొడక్షన్‌లో చేసిన మొదటి సినిమా ఇది. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదు. అంతర్జాతీయంగా వంద అవార్డులు రావడం, ఇలా ఫంక్షన్‌ చేయడం ఇదే మొదటి సారి’ అని తెలిపారు. ‘మూలాల్లోంచి రాసుకున్న కథ, అంతే సహజంగా తీయాలని అనుకున్నాను. అందుకే ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ చూశాను. అవార్డులు వచ్చిన సినిమాలు చూశాను. కానీ నా సినిమాకే వంద అవార్డులు వచ్చాయి. బలగం సినిమాకు మొదటి హీరో దిల్‌ రాజు. ఆయన నమ్మడం వల్లే ఈ సినిమా స్టార్ట్‌ అయింది. చిన్న సినిమాను నమ్మి పెద్ద ఎత్తుకు తీసుకెళ్లారు. శిరీష్‌, హన్షిత, హర్షిత్‌కు థ్యాంక్స్‌’ అని దర్శకుడు చెప్పారు.