అర్హతల ప్రకారం శాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు..

– ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పర్మినెంట్‌ చేస్తున్నాం…
– 61 ఏండ్లు పైబడిన వారి వారసులకు కారుణ్య నియామకం
– కింద సర్కారు కొలువులు : సీఎం కేసీఆర్‌ నిర్ణయం
–  నేడు ఉత్తర్వులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీరటి, మస్కూరు, లష్కర్‌ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు ఆయన వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్‌ఏల అర్హతలనుబట్టి మున్సిపాలిటీ, మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్‌ చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక పరిణామ క్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కనుమరుగవుతున్న వత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమనీ, దాన్ని అనుసరించే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని వివరించారు.
వ్యవసాయం అభివద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవెన్యూ తదితర అవసరాలకోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్‌ఏలుగా రూపాంతరం చెందిందని కేసీఆర్‌ తెలిపారు. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్‌ఏల వృత్తికి ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో, వారికి రెవెన్యూ శాఖలో సూపర్‌ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్‌ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న గ్రామ సహాయకులకు (వీఆర్‌ఏలు) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదనీ, ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారి విషయంలో తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సఫాయన్నా..నీకు సలామన్నా.. అంటూ డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తమదేనని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మస్కూరు తదితర పేర్లతో తమను తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్‌ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎంకు రుణపడి ఉంటామని వీఆర్‌ఏ జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో…ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ఎ.జీవన్‌ రెడ్డి, కష్ణ మోహన్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి,మదన్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారితోపాటు పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, వీఆర్‌ఏ జేఏసీ చైర్మెన్‌ రాజయ్య, కో చైర్మన్‌ రమేశ్‌ బహదూర్‌, సెక్రటరీ జనరల్‌ దాడే మీయా, కో కన్వీనర్లు షేక్‌ రఫీ, వంగూరు రాములు, మాధవ నాయుడు, వెంకటేశ్‌ యాదవ్‌, గోవింద్‌, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల క్రమబద్దీకరణ సర్దుబాటు విధానం..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారున్నారు. వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్దారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తాం…’ అని సీఎం తెలిపారు.
-అందుకనుగుణంగా చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.
-61 ఏండ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. అదేవిధంగా… 2 జూన్‌ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్‌ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్‌ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. చనిపోయిన వీఆర్‌ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను, వీఆర్‌ఏ జేఏసీ నేతలను కోరారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలన్నారు.