భారీ వర్ష సూచనలు మేర అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నవతెలంగాణ – అశ్వారావుపేట
మూడు రోజుల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల తెలిపారు. ఈ మూడు రోజుల పాటు వాతావరణ శాఖ మోడల్ ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. గ్రామ, మండల అలాగే జిల్లా స్థాయి అధికారులు కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.పొంగి పొర్లుతున్న వాగులు,కాలువలు ప్రజలు దాటటానికి ప్రయత్నించ వద్దని అన్నారు.పొంగే వాగులు పై రవాణా సేవలు నిలిపివేయాలని అధికారులకు సూచించారు.నిండు కుండల వలే ఉన్న జలాశయాలను వీక్షించడానికి అవకాశం లేకుండా నియంత్రణ చేయాలన్నారు.రహదారుల పైకి నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని ప్రమాద హెచ్చరికల బోర్డు లు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు.రహదారులపై  పడిన చెట్లు తక్షణమే తొలగించాలని ప్రజా రవాణాను పునరుద్ధరించాలని తెలిపారు.ఎడతెరిపి లేకుండా వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉందని అలాంటి వారిని గుర్తించి  సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా  చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950 కంట్రోల్ రూముకు కానీ,వాట్సప్ నంబర్ 9392919743 కు మెసేజ్ కానీ వీడియో కాల్ కానీ చేయాలని చెప్పారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 9392919750,  భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో 08743-232444, వాట్స్ ప్ నంబర్ 7981219425 లకు మెసేజ్ లేదా వీడియో  పంపాలని చెప్పారు. 24 గంటలు పని చేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము లకు ఫోన్ చేయాలని  ప్రజలకు సూచించారు.వర్షాలకు పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నదని, మేతకు బయటకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచి రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్లు ను, నాటు పడవలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర సేవలకు
ఎన్ డి ఆర్ ఎఫ్  సేవలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.