వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్‌..

– పూర్తి షెడ్యూల్‌ ఇదే: బీసీసీఐ
న్యూఢిల్లీ : స్వదేశంలో టీమిండియా 2023-24లో ఆడనున్న మ్యాచ్‌ల వివరాలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. ఏడాది కాలంలో భారత సీనియర్‌ పురుషుల జట్టు సొంతగడ్డపై 16 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుందని తెలిపింది. ఇందులో 5 టెస్టులు, మూడు వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఉన్నట్టు ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ జరుగనుందన్న బీసీసీఐ.. మొహాలీ, ఇండోర్‌, రాజ్‌కోట్‌ వేదికలుగా ఉంటాయని పేర్కొంది. వన్డే వరల్డ్‌కప్‌ కంటే ముందే అంటే.. సెప్టెంబరు 22- 27 వరకు ఈ సిరీస్‌ జరుగనుందని వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్‌ తర్వాత టీమిండియా ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుందని తెలిపింది.
నవంబరు 23న వైజాగ్‌లో మొదలై డిసెంబరు 3న హైదరాబాద్‌ మ్యాచ్‌తో ఆసీస్‌ టూర్‌ ముగుస్తుందని పేర్కొంది. ఇక కొత్త ఏడాదిని అఫ్గనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌తో ఆరంభించనుందని భారత క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. మొహాలీ, ఇండోర్‌, బెంగళూరులలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతుందని పేర్కొంది. అదే విధంగా భారత్‌లో అఫ్గనిస్తాన్‌ తమ మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ను బెంగళూరులో ఆడబోతోందని తెలిపింది. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుందని వెల్లడించింది. హైదరాబాద్‌, వైజాగ్‌, రాజ్‌కోట్‌, రాంచి, ధర్మశాల ఇందుకు వేదికలుగా ఉంటాయని బీసీసీఐ ప్రకటించింది.