రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఇదొక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. రవికుమార్ చౌదరి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ, రొమాన్స్ ఎక్కడా తగ్గకుండా ఉంటాయి’ అని అన్నారు. ‘ఇది నా గత సినిమాలకు తగ్గకుండా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, నా మార్క్ ఎమోషన్తో పాటు ఇందులో యూత్ ఫుల్ రోమాన్స్ కూడా టచ్ చేశాను. ఒక పాయింట్గా చెప్పాలంటే.. ఒక బంధాన్ని నిలుపుకోవడం కోసం భార్యాభర్తలు, ప్రేమికులు ఎంతవరకూ వెళ్తారనేది చాలా వినోదాత్మకంగా చూపించాం. చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి’ అని దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి అన్నారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ,’దాదాపు చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా మా బ్యానర్కి మంచి పేరు తీసుకొస్తుంది. రవికుమార్ చౌదరి గత చిత్రాల్లానే మంచి సినిమాగా నిలుస్తుంది. రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్తా మామ’ లాంటి విజయవంతమైన చిత్రాల కోవలోకే ఈ సినిమా కూడా చేరుతుంది. ఈ సినిమాని ఈ నెలాఖరకు లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.