– మద్దతు ఇచ్చిన వైసీపీ, హాజరుకాని టీడీపీ
– రాజ్యసభలో మూడు బిల్లులు ఆమోదం
– మద్దతు ఇచ్చిన వైసీపీ, హాజరుకాని టీడీపీ
– రాజ్యసభలో మూడు బిల్లులు ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. గురువారం లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీతో పాటు పివి మిథున్ రెడ్డి (వైసీపీ), పినాకి మిశ్రా (బీజేడీ), రాహుల్ రమేష్ షెవాలే (శివసేన (షిండే)) బిల్లుకు మద్దతివ్వగా, టీడీపీ హాజరుకాలేదు. బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంకే, టీఎంసీ, సీపీఐ(ఎం), జేడీయూ, ఎన్సీపీ, ఎస్పీ, సీపీఐ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫెరెన్స్, శివసేన (ఠాక్రే), ఆర్ఎస్పీ, ఆప్ తదితర ఇండియా కూటమి పార్టీలతో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుపై ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే మాట్లాడుతూ ఈ బిల్లు ఎన్నిక వర్సెస్ ఎంపికలా ఉందని తెలిపారు. బిల్లును వినయక్ రౌత్ (శివసేన ఠాక్రే) వ్యతిరేకించారు. ఆయా పార్టీల సభ్యులు మాట్లాడి తరువాత, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. సంతృప్తిచెందని ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారు. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఫార్మసీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2023ని స్టాండింగ్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష నేతలు కోరారు. మరోవైపు రాజ్యసభలో ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు, న్యాయవాదులు సవరణ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు.