ఆధార్‌తోనే బువ్వ…

– మిడ్‌ డే మీల్స్‌లో మోడీ సర్కార్‌ కోత!
– విద్యార్థుల ఆధార్‌ వివరాలు కోరిన కేంద్రం
– బడుగుల బిడ్డలపై సదువుల బండ
– ఆ ఆలోచనే విరమించుకోవాలి : సామాజిక కార్యకర్తలు
బతుకుబండి లాగటమే కష్టమవుతుంటే..సర్కారు బడుల్లో పెట్టే మధ్యాహ్న భోజనమైనా తిని బిడ్డలు బాగుపడతారు..అని అనుకుంటున్నారు పేదలు. కానీ మోడీ ప్రభుత్వానికి ఇవేం పట్టవు. పైసలుంటే కార్పొరేట్‌ బడుల్లో చదువుకోండి. అంతేకానీ మీకు సబ్సిడీలు,సంక్షేమ పథకాలు అమలు చేయటం అసాధ్యమంటోంది. ఎన్నికలొచ్చిపుడు మాత్రం కటాఫ్‌ డేట్లు పెట్టి మరీ పేదల ఓట్లేసుకోవటం కామన్‌ అయిపోయింది. తాజాగా ఆధార్‌ లింకు చేసి..మీడ్‌ డే మీల్స్‌ను ఎత్తేసే కుట్రలకు దిగుతోంది. ఇది పేద కుటుంబాలను చదువులనుంచి దూరం చేయటమే నని సామాజికవేత్తలు ఆక్షేపిస్తున్నారు
న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మిడ్‌డే మీల్స్‌ అమలు ఇప్పటికీ సమస్యగానే మిగిలి ఉన్నది. ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడంలో యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం చర్య ఇప్పుడు కలవరానికి గురి చేస్తున్నది. ఈ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
దేశంలోని ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆధార్‌తో ప్రామాణీకరించబడిన విద్యార్థుల సంఖ్య మరియు ప్రతి ఒక్కరికి అందించే భోజనాల సంఖ్యపై కేంద్రం నెలవారీ అప్‌డేట్‌లను కోరింది. ఇప్పుడిదే పేద వర్గాలకు చెందిన విద్యార్థులు, వారి కుటుంబాలలో భయాలను రేకెత్తిస్తున్నది. కేంద్రానికి చెందిన పీఎం పోషణ్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా డేటాను అప్‌లోడ్‌ చేయాలనే ప్రభుత్వ ఆదేశంతో ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులపై ఇటీవల కేంద్రం తీరు నేపథ్యంలో మిడ్‌ డేమీల్స్‌పై ఈ అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు.
ఇటు ఆధార్‌ అనుసంధానంపై ఆందోళనలు వెలువడుతున్నప్పటికీ సంబంధిత విభాగాలు మాత్రం స్పష్టతను ఇవ్వడం లేదు. పాఠశాల విద్యా కార్యదర్శి సంజరు కుమార్‌కు ఈ విషయంలో ఈ-మెయిల్‌ పంపినా సమాధానం లేదని సామాజిక కార్యకర్తలు అన్నారు. మధ్యాహ్న భోజనానికి ఆధార్‌ లింక్‌ చేయడం వినాశకరమైనదని సామాజిక కార్యకర్త నిఖిల్‌ డే అభిప్రాయపడ్డారు. దేశంలో చాలా మంది పిల్లలు ఇంకా ఆధార్‌ కోసం నమోదు చేసుకోలేదని తెలిపారు. ఉచిత పాఠశాల విద్య ఒక హక్కు అనీ, దాన్ని లాభదాయకంగా చూడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే. అయినా మోడీ ప్రభుత్వం మీడ్‌ డే మీల్స్‌ కు ఆధార్‌ లింక్‌ చేయటం లాంటి చర్య.. ఏదైనా చట్ట విరుద్ధం అని, ఏ పాఠశాల ప్రయోజనం అయినా ఆధార్‌పై షరతులు విధించబడదని ఆర్థికవేత్త, పబ్లిక్‌ పాలసీ నిపుణుడు జీన్‌ డ్రేజ్‌ అన్నారు. ఆధార్‌-ప్రామాణీకరించబడిన విద్యార్థుల సంఖ్య, జిల్లా అధికారుల నుంచి ప్రతి పాఠశాలకు వచ్చిన నిధులు, నెలలో ఖర్చు చేసిన నిధులు, ఈనెలలో వడ్డించిన భోజనం గురించి నెలవారీ డేటాను కోరుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత నాలుగు నెలల్లో అన్ని రాష్ట్రాలకు రెండు లేఖలు రాసింది. ప్రతినెలా పది లోపు ప్రధాన మంత్రి పోషణ్‌ పోర్టల్‌లో డేటాను అప్‌లోడ్‌ చేయాలని జాయింట్‌ సెక్రెటరీ ప్రాచీ పాండే తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ఆధార్‌ ఫీడ్‌ చేసిన తర్వాతే మధ్యాహ్న భోజనం పథకంలో ఆధార్‌ అనుసంధానం విజయవంతం అవుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ , నెట్‌వర్క్‌ పనితీరు తక్కువగా ఉండటం, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా చాలా పాఠశాలలు జిల్లా అధికారులకు డేటాను పంపడానికి ఇబ్బంది పడతాయని విశ్లేషకులు అన్నారు. ప్రధాన మంత్రి పోషన్‌ పథకం 11 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల వరకు 11 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. అయితే, వీరిలో పేద, అణగారిణ వర్గాల ప్రజలు అధికంగా ఉంటారనీ, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ వారిని ఈ పథకం నుంచి దూరం చేస్తుందని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు అన్నారు. ఈ ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సూచించారు.