ఢిల్లీ మేయర్‌ షెల్లీ

– 15 ఏండ్ల తర్వాత బీజేపీని ఊడ్చేసిన చీపురు
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరపాలిక పీఠం ఆమ్‌ ఆద్మీ పార్టీకి దక్కింది. ఆప్‌ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరారు ఎన్నికయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్‌ ఎన్నికలో ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరారు గెలుపొందారు. ఢిల్లీ మున్సిపల్‌ హౌస్‌లో జరిగిన ఈ ఎన్నికలో బీజేపీకి 116 ఓట్లు పోలవ్వగా, ఆప్‌కు 150 ఓట్లు పడ్డాయి. దీంతో 34 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి ఒబెరారు మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్‌ గెలుపుపై ఆప్‌ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ట్విట్టర్‌ వేదికగా ఒబెరారుకి అభినందనలు తెలిపారు. కాగా, మేయర్‌ ఎన్నిక విషయంలో ఇప్పటికే మూడుసార్లు మున్సిపల్‌ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆప్‌, బీజేపీల మధ్య వాగ్వాదం వల్ల మేయర్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయరాదని ఆప్‌ సుప్రీంలో కేసు వేసిన విషయమూ విదితమే. దీనిపై విచారించిన సీజేఐ డివై చంద్రచూడ్‌… నామినేటెడ్‌ సభ్యులకు ఓటుహక్కు లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాల్టీలో .. ఆమ్‌ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలవగా బీజేపీ 113 సీట్లు కైవసం చేసుకున్నది. చివరి వరకూ హైడ్రామా కొనసాగినా…అంతిమంగా ఆప్‌ మేయర్‌ గిరి దక్కటం..బీజేపీ వర్గాలకు మింగుడుపడటంలేదు.