భావోద్వేగాల సమాహారం

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికేట్‌ పొందింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మార్చి 3న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ,’తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులోని ప్రతి ఒక పాత్ర మిమ్మల్ని హాంట్‌ చేస్తుంది. సినిమాను చూసిన వారందరూ అప్రిషియేట్‌ చేశారు. సినిమాలో హీరో తాత పాత్రలో సుధాకర్‌ రెడ్డి, హీరో తండ్రిగా జయరాం, అలాగే నారాయణ పాత్రలో మురళీధర్‌, హీరో మేనత్త పాత్రలో విజయ లక్ష్మి, హీరో తల్లి పాత్రలో స్వరూప, హీరో బాబారు పాత్రలో మొగిలి ఇలా ఈ పాత్రలన్నీ మనకు గుర్తుండిపోతాయి. భీమ్స్‌ సంగీతంలో కాసర్ల శ్యామ్‌ రాసిన పాటలు హదయాలకు హత్తుకున్నాయి. మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు భావోద్వేగాల సమాహారమే ఈ సినిమా’ అని అన్నారు.