ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలి

– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్‌
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అండ్‌ హెచ్‌ఎం స్కీములో 20ఏండ్లుగా పనిచేస్తున్న సుమారు 15 వేల మంది కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్‌ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్‌, ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రామా రాజేష్‌ ఖన్నా డిమాండ్‌ చేశారు. గురువారం ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కోఠిలోని కమిషనరేట్‌ ఎదుట వందలాదిమంది కార్మికులతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ యూసుఫ్‌ మాట్లాడుతూ.. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో పీ.హెచ్‌.ఎం. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టులు, అకౌంటెంట్స్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌, ముగ్గురు మెడికల్‌ అసిస్టెంట్‌ / ఎం.ఎన్‌.ఓ. వాచ్‌మెన్‌, స్వీపర్‌, బస్తీ దవఖానా స్టాఫ్‌నర్స్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌, బ్లడ్‌ బ్యాంకు డి.ఈ.ఓ, ల్యాబ్‌ అటెండర్‌, ఎస్‌.ఎన్‌.సి.యూ.డి.ఈ.ఓ, సెక్యూరిటీ గార్డ్స్‌, టీ-హబ్‌ మేనేజర్‌, అవుట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు, ఎఎన్‌ఎమ్‌లు లాంటి అనేక క్యాడర్ల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు విడుదల చేసిన 510 జీవోతో వీరికి నష్టం జరుగుతుందని, చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్‌ వేతనం ఈ సిబ్బందికి అమలు చేయాల్సినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీములో పనిచేస్తున్న డాక్టర్లను ఏ విధంగా రెగ్యులరైజ్‌ చేశారో అదే పద్ధతిలో మిగతా క్యాడర్‌నూ క్రమబద్ధీకరించాలని, లేనిపక్షంలో సమ్మెకు వెళతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో బాల సుబ్ర మణ్యం, బాపు యాదవ్‌, సుమన్‌, మురళి. హరీష్‌. నరసింహ, చిరంజీవి, రేవతి, నీలం, మీనాక్షి, రజిత, జయలక్ష్మి, భవాని, బాలకృష్ణమ్మ పాల్గొన్నారు.