– నిధులు సమంగా పంచాలి!
– ఐసీసీకి ఎంసీసీ సూచన


దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పేందుకు నిధుల పంపకం సమంగా ఉండాలని ఎంసీసీ (ది మెర్లీబోన్‌ క్రికెట్‌ క్లబ్‌) సూచించింది. దుబారులో సమావేశమైన ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌ కమిటీ (డబ్ల్యూసీసీ) ఐసీసీకి సూచనలు చేసింది. సౌరవ్‌ గంగూలీ, అలస్టర్‌ కుక్‌, కుమార ధర్మసేన, జస్టిన్‌ లాంగర్‌, రమీజ్‌ రాజా, కుమార సంగక్కర, గ్రేమ్‌ స్మిత్‌లు హాజరైన ఈ సమావేశానికి మైక్‌ గాటింగ్‌ అధ్యక్షత వహించారు. ‘ ప్రపంచ క్రికెట్‌ ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌కు చేరుకుందని డబ్ల్యూసీసీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌, ప్రాంఛైజీ క్రికెట్‌ మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకు ఐసీసీ జోక్యం అవసరం. కొన్ని చోట్ల సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు విపరీత ఆదరణ ఉండగా.. మరికొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌, ఆధునిక గ్లోబల్‌ ప్రాంఛైజీ క్రికెట్‌ కలిసి వృద్ది చెందేందుకు తగిన చర్యలు అవసరమని’ ఎంసీసీ డబ్య్లూసీసీ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ క్రికెట్‌లో నిధులను సభ్య దేశాలకు సమానంగా పంచాలని సూచించిన కమిటీ.. అది ఏ రూపంలో, ఏ విధానంలో జరగాలనే అంశంలో స్పష్టత ఇవ్వలేదు.