మనువాదం వర్సెస్‌ మానవవాదం

ఇవాళ ప్రపంచంలో మూడు అతిపెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. ఒకటి-ఆయుధాలు, రెండు- మాదక ద్రవ్యాలు, మూడు-ఆధ్యాత్మికత. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు తయారీలో ఎంతోకొంత పనిచేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధ్యాత్మికతలో ఇవ్వాల్సింది ఏమీ ఉండదు. చేయాల్సింది కూడా ఏమీ ఉండదు. అందుకే భారతదేశంలో ఆద్యాత్మికవేత్తలు ఎక్కువ. ఈ ఆధ్యాత్మిక సూపర్‌ మార్కెట్‌లో అడి గిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది. ఈ మెయిల్‌లో మోక్షం అందుతుంది. ఆత్మ సాక్షా త్కారంలో క్రాష్‌ కోర్సు ఉంటుంది. నాలుగైదు సులభ వాయిదాలలో విశ్వచైతన్యం లభిస్తుంది. ఈ ఆధ్యాత్మిక సూపర్‌మార్కెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలున్నాయి. అశాంతి తో ఉన్న ఉన్నత వర్గాలు, సంపన్న కుటుంబాలు ఆ దుకా ణాలలో ఆధ్యాత్మికత పేరుతో దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ కొనుక్కుని తింటూ ఉంటాయి. అదేమిటో పూటపూటకూ రెక్కలు ముక్క లు చేసుకునే అలగా జనానికి దీని అవసరమే ఉండదు.
నిజాలు చెప్పినప్పుడు ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటే, వారు-వారి మనోభావాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ మారవు. వాటిని మార్చి చెప్పి కొందరికి సంతోషం కలిగించాలనుకుంటే అవి, అప్పుడు నిజాలుగా ఉండవు కదా? నిజాలు తెలుసుకో వాలనుకున్న నిజాయితీ గలవారు మనోభావాల్ని మూసి పెట్టుకుని, నిజాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి! కృష్ణా కాన్షస్‌నెస్‌కు సంబంధించిన ఓ స్వామి, మనల్ని ఎలా ఆలోచించమని చెపుతున్నాడో చూడండి… దేవాలయాల అవసరం చాలా ఉంది అని, మనతోనే చెప్పించాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆయన ఇలా అన్నారు…
”దేవాలయాలు కట్టడానికి అనవసరంగా ధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారూ? అని కొందరు అంటూ ఉంటారు. దేవాలయాలు కట్టడంకంటే పేదల ఆకలి తీర్చ వచ్చు కదా? పాఠశాలలు, ఆసుపత్రులు కట్టొచ్చుకదా? అవసరమైన వారికి అవసరమైన రీతిలో ఖర్చు చేయవచ్చు కదా?” అని ప్రశ్నిస్తుంటారు. నిజమే! కానీ, క్లబ్‌లు, పబ్‌లు, సినిమా హాళ్ళు, క్రికెట్‌ల మీద ఎందుకు ఖర్చుచేస్తున్నారు – అనేది మాత్రం ఆలోచించరు. మనిషన్నాక ఎంటర్‌టెయిన్‌ మెంట్‌ అవసరం కదా అని అంటారు. కానీ, ఎన్‌లైట్‌మెంట్‌ (జుచీూ×+నుజుచీవీజుచీు) కూడా అవసరమని ఆలోచిం చరు. మనిషైన వాడికి ఆధ్యాత్మిక చింతన, ప్రశాంత జీవనం అవసరమే కదా? మానసిక వేదనలతో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదుపుతప్పిన ఆవేశాలతో ఎందరో ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నారు. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన పనిలేదా? దైవ చింతనతో గడుపుతూ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకోవాల్సిన పని లేదా? మా హరేరామ హరేకృష్ణ మిషన్‌లాంటివి పేదలకు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాయి. మత పరమైన విహార యాత్రలు పెరిగితే, ఆర్థిక వనరులు పెరుగుతాయి. వాటి చుట్టూ మరెన్నో వ్యాపారాలు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకు ఆలోచించరూ?” అని స్వామి ప్రశ్నించారు.
ఇందులో మనం ఎన్‌లైట్‌మెంట్‌ – జ్ఞానో దయం గురించి మాట్లాడే పనేలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో ‘పూజారులు’గా ఉన్నవారికే జ్ఞానోదయం కాలేదు. ఇక ఓ గంట కోసమో, పూటకోసమో ఇలా వెళ్ళి అలా వచ్చేవారికి ఏం జ్ఞానోదయం అవుతుందీ? హరేరామ హరేకృష్ణ వాళ్ళు, సిక్కు గురుద్వార వాళ్ళు, సంత్‌ సంగ్‌ల వాళ్ళు వాళ్ళదగ్గరికి వచ్చిన వారికి భోజనం పెడు తుంటారు. ఎందుకంటే వారి దగ్గరికి వచ్చినవారి సంఖ్య తగ్గిపోగూడదని! అది వారి జాగ్రత్త!! జనం ఆకలి తీర్చాలంటే మురికివాడల్లో తిండిలేక మలమల మాడుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. హిందూ దేవాలయాల ముందు మెట్ల ముందు అడుక్కునేవారు ఉంటారు. వారి ఆకలి తీర్చాలి కదా?
క్రికెట్‌, పబ్స్‌, సినిమాహాళ్ళూ ఎలా వ్యాపార కేంద్రాలో- అలా అన్ని మతాల అన్ని ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు కూడా వ్యాపార కేంద్రా లేనని మొదట ఒప్పుకోండి! ఎన్ని ఆత్మహత్యలు ఈ దేవాలయాలు ఆపగలిగాయి? ఎన్ని అత్యా చారాల్ని, ఎన్ని హత్యల్ని, ఎన్ని డ్రగ్స్‌ దందాల్ని ఈ దైవ క్షేత్రాలు ఆపగలిగాయీ? ఎవరైనా లెక్కలివ్వగలరా? ఈ ఆధ్యాత్మికత ఎంతమందికి ప్రశాంతత ఇవ్వగలుగు తోంది? ఎంతమందికి ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వగలుగుతోంది? ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ దేశంలో ఎక్కువ! మరి ఏ దేశంలోనూ లేని అల్లకల్లోలం ఈ దేశంలో ఎందుకుందీ? ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా? దేవుడొక్కడే అని చెపుతున్నప్పుడు ఇన్ని రకాల ప్రార్థనా స్థలాలు ఎందు కున్నాయీ? వాటి మధ్య విభేదా లెందుకున్నాయి? వాటి కారణంగా జనం ఎందుకు విడి పోతున్నారూ? జనం మధ్య రాజకీయాలు చొరబడి అఘాధాలు ఎందుకు పెంచుతున్నాయీ? జనం మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలకు ఎందుకు దారి తీస్తున్నాయీ? ఏ మత కేంద్రంలోనైనా ‘మానవత్వం’ అనే మాట వినిపిం చదు ఎందుకూ? మనిషి ప్రమేయం లేకుండా ఏ మతా నికి చెందిన ఏ దేవుడైనా ఏమీ చేయలేడని ఎందుకు ప్రకటించరు? జ్ఞానోదయం సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు చెప్పే దేవదేవుణ్ణి ‘నిజం’ చేసి చూపండి.
దేవుడే అబద్దం! అబద్దానికి బంగారు కిరీటాలు పెట్టి, పట్టుబట్టలు కట్టి, గుళ్ళూ గోపురాలు కట్టి, పూజలు, భజనలు చేసినంత మాత్రాన అబద్దం నిజమైపోతుందా? కల్పించుకున్న దేవుడు శక్తిమంతుడైపోతాడా? ఒకవైపు దేవుణ్ణి శక్తిమంతుణ్ణి చేయడానికి-మరోవైపు మనుషుల్ని విభజించి శక్తిహీనులుగా తయారుచేయడానికి రాసుకున్నదే ‘మనుధర్మ శాస్త్రం’. ఇది మనుషులంతా ఒక్కటే అని చెప్పే ఆధునిక మానవవాదం ముందునిలవదు- మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రార్థనా స్థలమూ అక్కరలేదు. ఏ నది ఒడ్డునో, చెరువు గట్టునో, చెట్ల మధ్యో గడిపితే చాలు. ఏదీ లేకపోతే డాబామీద పడుకుని ఆకాశం, నక్షత్రాలు చూస్తూ ఆనందించగలిగితే చాలు. ఇష్టమైన సంగీతం వింటేనో, ఇష్టమైన సాహిత్యం చదివితేనో మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయాల చుట్టూ, ప్రార్థనా స్థలాల చుట్టూ తిరిగి ఎన్‌లైట్‌మెంట్‌ పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా? వేల వేల మందితో కలిసి, క్యూలలో నిలబడి, దైవదర్శనం గోలలో పడి, ఒళ్ళు హూనమై తలనొప్పులు తెచ్చుకునే వారికి నిజంగానే జ్ఞానోదయం కావాలి. కానీ అవుతోందా? ఆధ్యాత్మిక ప్రశాంతత-అక్కడ లభిస్తోందా? ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. పారసిటమాల్‌ బిళ్ళవేసుకుంటే జ్వరం తగ్గినట్టు-ఏ ప్రార్థనా స్థలానికో పోయి కూచుంటే జ్ఞానోదయమైన ఉదంతా లున్నాయా? దేవాలయాల నిర్మాణం కన్నా పాఠశాలలు కట్టండి! ఆసుపత్రులు కట్టండి!! అని చెప్పేది ఎందుకంటే భావితరాల కోసం. ఇప్పటి పిల్లల్ని రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం. ఇక ఆసుపత్రులుంటేనే అందరి ఆరోగ్యాలు బావుంటాయి గనుక!
ప్రార్థనా స్థలాలకు వెళితే చదువురాదు, ఆరోగ్యమూ బాగుపడదు. లేని దేవుణ్ణి నమ్మి, మూఢభక్తికి అలవాటు పడి జీవితాన్ని అబద్దంగా మార్చుకోవడం జరుగుతోంది. జబ్బులకు వైద్యం చేయించుకోకుండా దేవుడికి మొక్కుకు న్నంత మాత్రాన, ముడుపులు కట్టినంత మాత్రాన, ఉపవాసాలున్నంత మాత్రాన ఎవరికీ ఏ జబ్బూ ఎప్పుడూ తగ్గలేదు. తగ్గినవి ఉంటే నిరూపించి చూపాలి కదా? ప్రార్థనా స్థలాన్ని కానీ, దైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకుని వస్తే శరీరం నుంచి నెగటివ్‌ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది- అని కొందరు విశ్వాసకులు దుష్ప్రచారం చేస్తుంటారు. వ్యక్తిగతంగా మనిషి ఆలోచనా విధానాన్ని బట్టి పాజిటివ్‌, నెగిటివ్‌లు ఉంటాయి తప్పితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ ఉండదు. మొక్కులు, ముడుపులు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ ఒక వాస్తవ సంఘటనని గుర్తుచేస్తున్నాను. ఒకసారి ఒకతను అడవిలో నడుస్తూ ఉండగా చెప్పు తెగిపోయింది. తెగిన చెప్పుతో ముందుకు నడవలేక అతను ఒక చిలిపి పనిచేశాడు. దాని పక్కన గల ఒక చెట్టుకు తెగిన చెప్పులు తగిలించి, చెట్టు పక్కన ఉన్న బండమీద బొగ్గుతో ఇలా రాశాడు… ”ఈ చెట్టు కొమ్మమీద మీ చెప్పులను వేలాడదీస్తే మీ భార్య మీ చెప్పుచేతల్లో ఉంటుంది” అని… రాసి వెళ్ళిపోయాడు. అంతే! కొన్నాళ్ళకు ఆ చెట్టుకొమ్మలకు వందల చెప్పులు వేలాడబడ్డాయి. తెగిన చెప్పులు కాదు, వాడుకుం టున్న మంచి జతలు, కొత్తగా కొన్నవీ, అన్నీ చెట్టుకొమ్మల మీదికి చేరాయి. ఆ ప్రాంతంలో అదొక ఆచారమైంది. తర్వాత కాలంలో ఆ చెప్పుల చెట్టును వెతుక్కుంటూ జనం రాసాగారు. కొంతకాలానికి ఆ చెట్టు ఎటువైపు ఉందో చూపడానికి డైరెక్షన్‌ బోర్డులు వెలిశాయి. చెప్పులచెట్టు – తిరనాళ్ళ అయ్యింది. ప్రతి సంవత్సరం జనం గుమిగూడి ఉత్సవం చేయడం ప్రారంభించారు. సంప్రదాయాల పేరుతో మూర్ఖత్వం ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ! ఇలాంటివి దేశంలో అనేక చోట్ల అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.
”ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది” అని అన్నాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టారు. మనదేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మనువాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరుస్తూ ముందుకు సాగాల్సి ఉంది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణులే కాదు, అధిక సంఖ్యాకులైన బ్రాహ్మణేతరులే – నెత్తిన మోస్తు న్నారు. ఉదాహరణకు అయ్యప్పదీక్ష, భవానీ దీక్ష వంటి దీక్షలు తీసుకునేది బ్రాహ్మణేతరులే. అయ్యప్ప మాల, భవానీమాల, శ్రీనివాస మాల, శివమాల వంటి మాలలు వేసుకుని తిరిగేది బ్రాహ్మణేతరులే. వినాయక చవితి చందాలకు తిరిగేది, శోభాయాత్రలు నిర్వహించేది, పోటీ పడి వేలం పాటలో వినాయకుడి లడ్డూలు కొనుగోలు చేసేది బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణేతరులే. బ్రాహ్మణులు తెరవెనక ఉంటారే గానీ, కార్యరంగంలో కళ్ళముందు కనిపించే వారంతా ఇతర జాతులవారే. మనుధర్మ శాస్త్రంలో రాసి పెట్టినవన్నీ స్వంతం చేసుకుని, మను వాదాన్ని బలంగా నిలబెడుతున్నది శూద్రులే. ఈ మాట ఊరికే అనడం లేదు. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని, కొందరు ముఖ్యమంత్రులు చేసే పనులన్నీ ఒకటే! వీరు బ్రాహ్మణులేం కాదు, బ్రాహ్మణిజాన్ని మోస్తున్న పక్కా శూద్రులు. ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చుపెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగా లకు ప్రాధాన్యమిస్తున్నారు. వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా? ఒకసారి ఆలోచించండి!
కొందరు కులం తోకల్ని ”కొత్తగా”గా పేర్లకు తగిలిం చుకుని, తమది అస్థిత్వ పోరాటమని రొమ్ములు విరుచు కుంటున్నది చూస్తున్నాం. సామాజిక న్యాయం చేస్తున్నా మంటూ ప్రభుత్వాలు కూడా కులమతాల్ని పోత్సహించడం చూస్తున్నాం. ధనిక,, పేద ప్రాతిపదికన చర్యలుండాలి. కానీ, అలా జరగడం లేదు. ఒక్కోసారి ధనిక-నిమ్నవర్గాల వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పేద-అగ్రవర్ణం వారికి అందడం లేదు. అందుకే, నాస్తికులు, హేతు వాదులు, వైజ్ఞానిక పరిశీలకులు ఈ సమాజ స్వరూపాన్ని మరింత లోతుగా, కొత్తకోణంలో పరిశీలించాల్సి ఉంది. భిన్నంగా విశ్లేషించాల్సి ఉంది!

వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌.
డాక్టర్‌ దేవరాజు మహారాజు