– అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు సిద్ధం చేయాలి
– 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి
– సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్
నవతెలంగాణ-ఖమ్మం
సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా అడ్డుకట్ట వేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని పోలీస్ కమిషనరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సిద్ధమైన పోలీస్ అధికారులు సైబర్ మోసగాళ్ల ఆటకట్టించేలా ఈ విభాగం పకడ్బందీగా పనిచేస్తుందని తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింపజేయడం నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం, పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి చేధించడం వంటి కీలకమైన పాత్రను సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం పోషిస్తుందని తెలిపారు. ఈనెల 9న న్యాయస్థానాల్లో జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులతో పాటు భూ తగాద, చిట్ఫండ్, రోడ్డు ప్రమాద, ఎక్సైజ్, వివాహ, కుటుంబ తగాదాలతో పాటు ట్రాఫిక్ కేసులకు సంబంధించి డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ కేసులు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేలా చేసే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే నిర్వహణ సులభతరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా క్రిటికల్, పోలింగ్ కేంద్రాల గుర్తింపులో స్పష్టత ఉండాలన్నారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా నిఘా వ్యవస్థ పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని అన్నారు.