రాష్ట్రపతి విందుకు ఖర్గేకు అందని ఆహ్వానం

– దేశాధినేతలకు ప్రధాని మోడీ దావత్‌
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో :
జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు (శనివారం) ఇస్తున్న విందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. క్యాబినెట్‌ మంత్రి హౌదా ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదని ఖర్గే కార్యాలయం రాష్ట్రపతి విందుకు ఖర్గేకు అందని ఆహ్వానం శుక్రవారం తెలిపింది. ఈ విందుకు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించి, రాజ్యసభ ప్రతిపక్షనేతను మాత్రం ఆహ్వానించలేదు. మాజీ ప్రధాన మంత్రులు దేవె గౌడ, మన్మోహన్‌ సింగ్‌లను ఈ విందుకు ఆహ్వానించారు. ఈ విందులో పాల్గొంటామని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు. ఆహ్వానితులంతా శనివారం సాయంత్రం 5.45 గంటలకు పార్లమెంటు హౌస్‌ వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు. అక్కడి నుంచి భారత మండపం వద్దకు తీసుకెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల రాకపోకలు, ట్రాఫిక్‌ ఆంక్షల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. జీ20 సదస్సు జరిగే భారత మండపం వద్దకు ఆహ్వానితుల వాహనాల శ్రేణులు వెళ్లడానికి అనుమతి లేదు. క్యాబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులు, కార్యదర్శులు, ఇతర ప్రత్యేక అతిథులను తమ నివాసాల నుంచి పార్లమెంటు హౌస్‌కు తీసుకురావడం కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఢిిల్లీలోని ప్రగతి మైదానంలో ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ కాంప్లెక్స్‌లో భారత మండపాన్ని తీర్చిదిద్దారు. దీనిలోని మల్టీ ఫంక్షన్‌ హాలులో ఈ విందు ఏర్పాటైంది. అన్ని దేశాల నేతలకు ఈ వేదిక వద్ద ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలుకుతారు. వీరందరికీ మోడీ కూడా శనివారం వర్కింగ్‌ లంచ్‌ ఇస్తారు. మోడీ ఇక్కడికి శనివారం ఉదయం 9 గంటలకు చేరుకుంటారు. దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, విదేశాంగ మంత్రుల నేతృత్వంలో దాదాపు 40 బృందాలు రాబోతున్నాయి. సెక్రటరీ జనరల్‌ లేదా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ఒక్కొక్క ప్రతినిధి బృందంలో 150 మంది నుంచి 200 మంది వరకు ప్రతినిధులు ఉంటారు. వీరితోపాటు భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు, క్యాటరింగ్‌, ఇతర పనుల్లో పాల్గొనేవారు కూడా ఉంటారు. భారత మండపం వద్ద శనివారం మొత్తం మీద సుమారు 10,000 మంది పాల్గొంటారని జీ20 ఆపరేషన్స్‌ విభాగం ప్రత్యేక కార్యరద్శి ముక్తేష్‌ పర్దేశి చెప్పారు.