తెలుగులోనూ బ్లాక్‌ బస్టర్‌ ఖాయం

A blockbuster in Telugu tooసౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మల్‌ బార్సు’. ఈ సినిమా మలయాళ ఇండిస్టీ హిట్‌ అయ్యింది. అంతేకాదు 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ను తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఈనెల 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రీరిలిజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. నిర్మాతలు వివేక్‌ కూచిభొట్ల, శశిధర్‌ రెడ్డి, నవీన్‌ యెర్నేని, నిరంజన్‌ రెడ్డితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. నిర్మాత శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మొదటి రోజు ఈ సినిమా చూసిన వెంటనే సినిమాని తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. రవి, నవీన్‌ ఈ సినిమాని ఇక్కడ గ్రాండ్‌గా ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. ఇది బ్లాక్‌ బస్టర్‌ అని ముందే అనుకున్నాం. ఈ సినిమాకి లాంగ్వేజ్‌ బ్యారియర్‌ లేదు. ఇది పదిమంది బాల్య స్నేహితులకు సంబంధించిన కథ. ఇలాంటి స్నేహితులు జీవితంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఈనెల 5న ప్రీమియర్స్‌ కూడా వేస్తున్నాం. ఓ మలయాళం సినిమాని పెయిడ్‌ ప్రిమియర్స్‌తో వేయడం ఇదే తొలిసారి. ఇది బిగ్‌ ఎచీవ్మెంట్‌. దాదాపు 300 వందల స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమాని యుఎస్‌లో చూశాను. ఎక్స్‌ట్రార్డినరీ ఫిలిం. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్‌ ఫిలిం. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి బిగ్‌ హిట్‌ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’ అని నిర్మాత నవీన్‌ యెర్నేని చెప్పారు.