ఎన్విఆర్ ప్రొడక్షన్, ఎస్ఐడిఎస్ క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకత్వంలో విజరు రాజ్ కుమార్, నేహా పఠాని ఇందులో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ వేడుకకు హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ”ఏం చేస్తున్నావ్’ ఇది నా జీవితంలోనూ ఎక్కువగా ఎదురైన ప్రశ్న. ఇందులో చాలా అర్థాలు ఉంటాయి.
ఈ సినిమాకి పెట్టిన టైటిల్, టీజర్ బాగున్నాయి. గోపి సుందర్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ భరత్కు మంచి విజన్ ఉంది. తను మంచి స్టోరీ టెల్లర్ అవుతాడు. అలాగే హీరో మంచి విజయం సాధించాలి. ఈనెల 25న అందరూ తప్పకుండా థియేటర్లో ఈ చిత్రం చూడాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. డైరెక్టర్ భరత్ మిత్ర మాట్లాడుతూ, ‘ఈ సినిమా 18- 30 వయసు గల వారికి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి సినిమా తీశాం. థియేటర్లోకి ఎంతమంది వచ్చినా.. వచ్చినవారు కచ్చితంగా మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వెళ్తారు’ అని అన్నారు. సినిమా మస్త్ ఉంటదని, ఫస్ట్ ఆఫ్ డీసెంట్గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకోలేని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ రాజ్ కుమార్ తెలిపారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై ఉంటుందని, హాలీవుడ్ సినిమాలో కూడా చూడని ఒక హెలికాప్టర్ సీక్వెన్స్ ఉంటుందని ఆయన చెప్పారు.